
సీహెచ్ఓల సమ్మెకు మద్దతు
భీమవరం: తమ సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్ఓ) అసోసియేషన్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భీమవరం కలెక్టరేట్ వద్ద ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న సీహెచ్ఓల శిబిరం వద్దకు శనివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సీహెచ్ఓలకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వంతో పోరాడి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఉండి, పాలకొల్లు సమన్వయకర్తలు పీవీఎల్ నర్సింహరాజు, గుడాల గోపి, ఎంపీపీ పేరిచర్ల విజయ నర్సింహరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.