సంక్షోభంలో మామిడి పరిశ్రమ | - | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో మామిడి పరిశ్రమ

May 4 2025 8:06 AM | Updated on May 4 2025 8:06 AM

సంక్ష

సంక్షోభంలో మామిడి పరిశ్రమ

చింతలపూడి: మామిడి పరిశ్రమ ఈ సంవత్సరం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అకాల వర్షాలు, వడగళ్లు, మంగుతెగులు వంటి అనేక కారణాలతో మామిడి దిగుబడి తగ్గింది. మామిడి ఎగుమతుల్లో ఏలూరు జిల్లాలో నూజివీడు తరువాత స్థానం చింతలపూడిదే.. ఈ ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం మందగించింది. సీజన్‌ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంతవరకూ ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేవు. కాయ దిగుబడి లేకపోవడం, కోతకు వచ్చిన కొద్దిపాటి కాయ నాణ్యత లోపించడంతో ఎగుమతులు మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు. కాయ మంచి సైజుకు ఎదిగే వరకూ చెట్టుమీదే ఆపడానికి రైతులకు ధైర్యం చాలడంలేదు. అకస్మాత్తుగా గాలి దుమ్మో, వడగళ్ల వానో వస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే సమయానికి రోజుకు 25 లారీల సరుకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది ఐదు లారీలు కూడ ఎగుమతి చేయలేక పోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఇంతవరకు చింతలపూడి ప్రాంతం నుంచి 300 లారీల సరుకు మాత్రమే ఎగుమతి చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో టన్ను రూ.70 వేలు ఉన్న మామిడి ధర ఇటీవల హఠాత్తుగా పడిపోయింది. ప్రస్తుతం టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేలుగా ఉంది. ప్రస్తుత ధర రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. నాలుగేళ్లుగా మార్కెట్‌లో మామిడి ధరలు చూస్తే 2022లో ప్రారంభంలో టన్ను రూ.లక్షకు అమ్ముడైంది. సీజన్‌ చివరికి వచ్చేసరికి టన్ను రూ.25 వేలకు పడిపోయింది. 2023లో ప్రారంభంలో టన్ను రూ.80 వేలు అమ్మగా సీజన్‌ చివరిలో రూ.20 వేలకు చేరింది. 2024లో టన్ను రూ.90 వేలు అమ్మగా సీజన్‌ చివరిలో టన్ను రూ.30 వేలకు పడిపోయింది. ఇక్కడి నుంచి ముంబయ్‌, కోల్‌కతా, నాగపూర్‌, గుజరాత్‌, హైదరాబాద్‌, పూనే, అహ్మదాబాద్‌, ఢిల్లీ, కాన్పూర్‌, ఒడిశా వంటి ప్రాంతాలకు వ్యాపారులు మామిడి ఎగుమతి చేస్తున్నారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడిని రవాణా చేయడం వ్యాపారులకు భారంగా మారింది. ఈ ప్రాంతం నుంచి నాగపూర్‌ ఎక్కువగా ఎగుమతవుతుంది. విడికాయలు గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ చేస్తే టన్నుకు రూ.5 వేల వరకూ ఖర్చవుతుందని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో పాటు కిరాయి రూ 50,000 అవుతుందంటున్నారు. ఈ దశలో అటు రైతుల్లో, ఇటు వ్యాపారుల్లో ఇకపై మామిడి లాభసాటి కాదన్న అభిప్రాయం నెలకొంది.

జిల్లాలో తగ్గిన విస్తీర్ణం

జిల్లాలో అన్ని రకాల ఉద్యాన పంటలు కలిపి 1,08,300 హెక్టార్లలో ఉన్నాయి. ఒకప్పుడు జిల్లాలో లక్షలాది ఎకరాల్లో విస్తరించి ఉండే మామిడి తోటలు ప్రస్తుతం 40,000 ఎకరాలకు తగ్గిపోయాయి. అధిక భాగం మామిడి తోటలు తొలగించి రైతులు పామాయిల్‌ తోటలు వేసుకున్నారు. మామిడి స్థానంలో పామాయిల్‌ 44 వేల హెక్టారుల్లో ఆక్రమించింది. జిల్లాలో నూజివీడు నియోజకవర్గంతో పాటు చింతలపూడి, ద్వారకా తిరుమల, నల్లజర్ల, టి.నరసాపురం ప్రాంతాల్లో మాత్రమే మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి తోటల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు ప్రోత్సాహం అందించక పోతే భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉంది.

భారీగా తగ్గిన దిగుబడి

గిట్టుబాటు ధర లేక దిగాలు

మెట్ట ప్రాంతంలో ఏటా రూ.10 కోట్ల వ్యాపారం

మామిడి రైతులను ఆదుకోవాలి

ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. ఏటా సకాలంలో సరైన వర్షాలు కురవకపోవడం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడులు లేవు. ఏటా మామిడి వల్ల నష్టాలను తట్టుకోలేక నాకున్న 4 ఎకరాల తోటను తొలగించాల్సి వచ్చింది.

– చేపూరి ఖాదర్‌బాబు, రైతు, చింతలపూడి మండలం

నష్టం తప్పేలా లేదు

ఈ ఏడాది నష్టం వచ్చేలా ఉంది. నాణ్యత లేని కారణంగా ఎగుమతులు మందగించాయి. ధర పెరిగితేనే కాని నష్టాల నుంచి బయటపడడం కష్టం. ప్రారంభంలో టన్ను రూ.70 వేల వరకూ ఉన్న ధర ప్రస్తుతం రూ.20 వేలు అమ్ముతుంది. ప్రస్తుతం ధర ఇలాగే కొనసాగితే రైతులు, వ్యాపారులు నష్టపోవాల్సిందే.

– చిక్కాల నాగేశ్వర్రావు, మామిడి కమిషన్‌ వ్యాపారి, చింతలపూడి

సంక్షోభంలో మామిడి పరిశ్రమ1
1/3

సంక్షోభంలో మామిడి పరిశ్రమ

సంక్షోభంలో మామిడి పరిశ్రమ2
2/3

సంక్షోభంలో మామిడి పరిశ్రమ

సంక్షోభంలో మామిడి పరిశ్రమ3
3/3

సంక్షోభంలో మామిడి పరిశ్రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement