
కొల్లేరు అందాలు కనుమరుగు
●
లాంచీలతో ఆదాయం బాగుండేది
నాకు 6 లాంచీలు ఉండేవి. సర్కారు కాల్వ నుంచి పెద్దింట్లమ్మ దేవస్థానానికి భక్తులను తీసుకెళ్లేవాడిని. లాంచీలపై వచ్చే ఆదాయంతో జీవించేవాళ్ళం. నేడు కొల్లేరు సరస్సులో నీరు లేదు. పైగా గుర్రపుడెక్క పేరుకు పోయింది. దీంతో లాంచీలు వెళ్ళలేని పరిస్థితి.
– వై.త్రిమూర్తులు, లాంచీల యజమాని, గోకర్ణపురం
తాటి దోనెలు నడపడం కళ
కొల్లేరులో తాటిదోనెలు నడపడం పెద్ద కళ. ఇతర ప్రాంతాల ప్రజలు వీటిని నడపలేరు. కొన్ని సంవత్సరాల క్రితం అటవీశాఖ చిత్తడి నేలల దినోత్సవం రోజున సర్కారు కాల్వ వద్ద తాటిదోనెల పోటీలు నిర్వహించారు. కేరళ తరహా పడవల పోటీల మాదిరిగా కొల్లేరులో దోనెల పోటీలు నిర్వహిస్తే సంప్రదాయ దోనెల వేట తిరిగి జీవం పోసుకుంటుంది.
బలే సముద్రుడు, గ్రామపెద్ద, పందిరిపల్లిగూడెం
కై కలూరు : కొల్లేరు పేరు చెప్పగానే పక్షుల కిలకిలరావాలతో పాటు కొల్లేరులో ప్రయాణం మదిలో మెదులుతుంది. ఒకప్పటి కొల్లేరును, ఇప్పుడున్న పరిస్థితిని పరిశీలిస్తే.. ఆకులు రాలి ఎండిన మోడులా కనిపిస్తుంది. ముందు రోజు పట్టి నీటిలో ఉంచిన చేపలను తెల్లవారుజామునే మార్కెట్లో విక్రయించి జీవించేవారు. నేడు ఇలాంటి దృశ్యాలు కొల్లేరులో కానరావడం లేదు. కొల్లేరు జీవనానికి అద్దం పట్టే తిప్పతీగలతో మావులు(చేపలు పట్టడానికి వాడే బుట్టలు) అల్లే కార్మికుల జాడే లేదు. ఎంతో స్వచ్ఛంగా ఉండే కొల్లేరు నీరు నేడు కాలకూట విషంగా మారింది. కొల్లేరు పూర్వపు అందాలు భవిష్యత్తు తరాలకు పూర్తిగా కనుమరుగయ్యాయి.
లాంచీల ధ్వనులు మాయం
రాష్ట్రంలో కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలో సమక్మ, సారక్క జాతరకు అడవులు దాటి వెళ్ళాలి. పెద్దింట్లమ్మ జాతరకు పూర్వం కొల్లేరు నీటిలో లాంచీలు, పడవలపై ప్రయాణించాలి. సూర్యుడు ఉదయిస్తున్న వేళ అప్పుడే విచ్చుకుంటున్న కొల్లేరు కలువ పువ్వల మధ్య ప్రయాణం మధురానుభూతి కలిగిస్తోంది. ఏటా జాతకు సర్కారు కాల్వ నుంచి అమ్మవారి దేవస్థానం వరకు 70 లాంచీలు తిరిగేవి. వీటికి పడవలు అదనం. ఇదే కాకుండా కొల్లేటికోట నుంచి ఆకివీడు, పెద ఎడ్లగాడి, చిన ఎడ్లగాడి, నందిగామలంక వరకు లాంచీలు తిరిగేవి. ఒక్కో లాంచీలో 100 మంది ప్రయాణించేవారు. జాతరకు రాజమండ్రి, విజయవాడ, యానాం, ధవళేశ్వరం నుంచి కాల్వల ద్వారా లాంచీలు కొల్లేరుకు వచ్చేవి. నేడు నీటి కొరత కారణంగా ఒక్క లాంచీ కనిపించడం లేదు.
కొల్లేరు సరస్సులో వేట సాగించే ప్రజలకు పేదోడి రాకెట్గా తాటిదోనెకు పేరుంది. బలమైన తాటిచెట్టును ఎంపిక చేసి మొదలతో సహా తీసుకొచ్చి 15 రోజులు బరిసెలతో చెక్కేవారు. నీరు చేరకుండా తారును అద్దెవారు. దీనిలో ఇద్దరు కూర్చుని ప్రయాణించేవారు. తాటిదోనెలను నడపడం ఎంతో కష్టం. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన బోర్లా పడతారు. తాటిదోనె తయారీ రూ.350 నుంచి రూ.15,000కు చేరింది. తర్వాత ఇనుముతో చేసిన డొంగ్రీలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో డొంగ్రీ రూ.35,000 నుంచి రూ.40,000 పలుకుతోంది. తాటిదోనెల్లో వేటాడే సమయంలో సరస్సులో సహజసిద్ధ చేపలకు తాకినా వాటికి ప్రమాదం ఉండేది కాదు. ఇనుప డొంగ్రీల వల్ల చేపలు గాయపడుతున్నాయి. దోనెల తయారీదారులు తగ్గిపోయారు. తాటిచెట్ల కొరత ఏర్పడింది.
మావన తప్పిదాలతో ప్రమాదం
సరస్సుకి సమీప పట్టణాల నుంచి 19 ఫ్యాక్టరీల వ్యర్థజలాలు కొల్లేరులో చేరుతున్నాయని అంచనా. దీని కారణంగా సరస్సులో నల్లజాతి చేపలు అంతరిస్తున్నాయి. డ్రెయిన్లు, వాగుల ద్వారా కొల్లేరుకు చేరే నీటి వనరులు తగ్గాయి. ప్రధానంగా ఎగువ నుంచి కొల్లేరుకు చేరుతున్న నీటిని సరస్సు మధ్యలో అక్రమ చేపల సాగుదారులు చెరువులకు తోడుతున్నారు. దీంతో కొల్లేరులో నీరు కనిపించడం లేదు. ఈ కారణంతో ప్రజలకు చేపల వేట కరువవుతోంది. రెగ్యులేటర్లు నిర్మిస్తే కొల్లేరుకు తిరిగి పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు.
నెర్రలిచ్చి ఎడారిలా మారిన సరస్సు
కలగా మిగిలిన తాటి దోనెలపై వేట.. లాంచీలపై ప్రయాణం
ఒకనాటి కొల్లేరు అందాలు నేడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మానవ తప్పిదం కారణంగా కొల్లేరు ఎడారిగా మారింది. జలసిరులతో కళకళలాడిన కొల్లేరు నెర్రలిచ్చి వెక్కిరిస్తోంది. తాటి దోనెల స్థానాన్ని ఇనుప డొంగ్రీలు ఆక్రమించాయి. లాంచీల ప్రయాణం చరిత్రలో కలిసిపోయింది.

కొల్లేరు అందాలు కనుమరుగు

కొల్లేరు అందాలు కనుమరుగు

కొల్లేరు అందాలు కనుమరుగు

కొల్లేరు అందాలు కనుమరుగు