వ్యవసాయ పరిశోధనా ఫలితాలు రైతులకు చేరువ చేయాలి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ పరిశోధనా ఫలితాలు రైతులకు చేరువ చేయాలి

May 2 2025 1:34 AM | Updated on May 2 2025 1:34 AM

వ్యవసాయ పరిశోధనా ఫలితాలు రైతులకు చేరువ చేయాలి

వ్యవసాయ పరిశోధనా ఫలితాలు రైతులకు చేరువ చేయాలి

పెనుమంట్ర: వ్యవసాయ పరిశోధనా ఫలితాలు కేవలం పరిశోధనా స్థానానికే పరిమితం కాకుండా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఫలితాలు రైతులకు చేరువ చేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో రెండు రోజుల పాటు జరిగే గోదావరి మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని గురువారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన సహ సంచాలకులు డాక్టర్‌ టి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మార్టేరు పరిశోధన స్థానంలో విడుదల చేసిన వరి రకాలు ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం, భారతదేశంలో 33 శాతం విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్వర్ణ రకం ఈ పరిశోధనా స్థానం నుంచి విడుదల కావడం గర్వించదగ్గ విషయమన్నారు. పీఆర్‌ 126 రకానికి ప్రత్నామ్నాయ రకాలైన ఎంటీయూ 1290, ఎంటీయూ 1293, ఎంటీయూ 1273 రకాలను ప్రదర్శన క్షేత్రాల్లో సాగు చేసి రైతులు అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గుర్రపుడెక్క నుంచి కంపోస్టు తయారు చేసే ప్రక్రియను డ్వాక్రా సంఘాల ద్వారా నిర్వహిస్తున్నామని, డి కంపోజర్‌ల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. మరో ముఖ్య అతిథిగా వ్యవసాయ రంగ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు అవకాశం ఉన్న ప్రాంతాల్లో అనువైన సాంబ మసూరి(బీపీటీ 5204) మార్టేరు సాంబ(ఎంటీయూ 1224) మసూరి (ఎంటీయూ 1262) వంటి సన్నగింజ రకాలను సాగుచేయాలని అన్నారు. మరో ముఖ్య అతిథి ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్‌ జి శివన్నారాయణ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ వ్యవసాయ పరిస్థితులు, నెలకొన్న సమస్యలను గుర్తించి వాటికి తగ్గట్టుగా విస్తరణ ప్రణాళికలను రూపొందించాల్సి అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో గత సమావేశంలో రైతులు లేవనెత్తిన సమస్యలపై తీసుకున్న కార్యాచరణ, 2024–25 సంవత్సరపు పరిశోధన ప్రగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సభికులకు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జడ్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌కే బాషా, మాధవరావు, శ్రీహరి, వివిథ జిల్లాలనుంచి వచ్చిన వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

కలెక్టర్‌ చదలవాడ నాగరాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement