
సరైన ఏర్పాట్లు లేకే భక్తుల మృతి
వీరవాసరం: సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఏడుగురు భక్తులు చనిపోవడం అత్యంత దురదృష్టకరమని మండలి సభ్యుడు కౌరు శ్రీనివాస్ బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక బందోబస్తు, సరైన వసతి ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఇలాంటి అపచారం ఎప్పుడు చోటు చేసుకోలేదన్నారు.
పదవీ విరమణ చేసిన పోలీసులకు సత్కారం
భీమవరం: పోలీసు శాఖలో అంకిత భావంతో చేసిన సేవలు ప్రసంశనీయమని జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు అన్నారు. పోలీసు శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం సన్మానించారు. తాడేపల్లిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై కె.కొండలరావు, భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.భాస్కరరావు, నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ విశ్వేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందచేశారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలి
తాడేపల్లిగూడెం రూరల్: బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలని బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల ఆదిశేషు అన్నారు. బుధవారం మండలంలోని నీలాద్రిపురంలో సర్పంచ్ రాజమహేంద్రవరపు లక్ష్మణరావు నివాసంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆదిశేషు మాట్లాడుతూ బీసీలకు అందాల్సిన ఫలాల కోసం కష్టించి పనిచేయాలన్నారు. బీసీలకు సేవ చేయడానికే బీసీ వెల్ఫేర్ జేఏసీ పనిచేస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడిగా రాజమహేంద్రవరపు లక్ష్మణరావును నియమిస్తున్నట్లు వెల్లడించారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చప్చిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు సేవ చేసే వారిని జేఏసీలో చేర్చాలని సూచించారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి రఘు తదితరులు మాట్లాడరాఉ. బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా కమిటీలో నియమిస్తూ పలువురికి నియామకపు పత్రాలను అందజేశారు.
ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 5 ప్రభుత్వ, 14 ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రవేశాల కన్వీనర్, ఏలూరు ప్రభుత్వ ఐటీఐ ప్రధానాధికారి పీ. రజిత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 804, 14 ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ఆయా కోర్సుల్లో 1672 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దరఖాస్తు కాపీ ప్రింట్ను తన ఒరిజినల్స్తో విద్యార్థి ఏదైనా ప్రభుత్వ ఐటీఐలలో మే 26వ తేదీ సాయంత్రం 5గంటల లోపు వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. వివరాలకు 08812–230269 నెంబరులో సంప్రదించవచ్చన్నారు.
సీహెచ్ఓల ఆందోళనకు మద్దతు
ఏలూరు (టూటౌన్): ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గత మూడు రోజులుగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సీహెచ్ఓలకు బుధవారం ఎన్జీవో నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, కార్యదర్శి ఎన్వి రామారావులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. న్యాయ మైన కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.

సరైన ఏర్పాట్లు లేకే భక్తుల మృతి

సరైన ఏర్పాట్లు లేకే భక్తుల మృతి