మొగల్తూరు మామి‘డీలా’ | - | Sakshi
Sakshi News home page

మొగల్తూరు మామి‘డీలా’

Jun 2 2025 1:05 AM | Updated on Jun 2 2025 1:22 AM

మొగల్

మొగల్తూరు మామి‘డీలా’

సాక్షి, భీమవరం: చూడచక్కని రంగు.. మధురమైన రుచితో మనసు దోచే పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మామిడి ప్రతికూల వాతావరణం, పండుఈగ దాడితో ధర లేక వెలవెలబోతోంది. స్థానిక అమ్మకాలు, దేశ విదేశాలకు ఎగుమతులతో ఏటా రూ.32 కోట్లకు పైగా వ్యాపారం జరిగితే, ఈ ఏడాది సగం అమ్మకాలు లేని పరిస్థితి. తోటల లీజు, పెట్టుబడి ఖర్చులు రాక తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని 1800 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఎకరాకు ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సారవంతమైన నేలలతో ఈ ప్రాంతంలోని మామిడి కాయలు 500 గ్రాముల నుంచి 700 గ్రాములకు పైగా బరువుతో మంచి రంగు, రుచి కలిగి ఉంటాయి. సహజసిద్ధంగా కాయలు పక్వానికి వచ్చాక మాత్రమే కోసి అమ్మకాలు చేయడం వల్ల ఇక్కడి బంగినపల్లి, రసాలు తదితర మామిడి పండ్లకు గిరాకీ ఎక్కువ. ఎంతోమంది వీటిని కొనుగోలు చేసి దేశ విదేశాల్లోని తమ బంధువులు, స్నేహితులకు పంపిస్తుంటారు.

పండు ఈగ దాడికి విలవిల

ఏటా ఏప్రిల్‌ మొదటి వారం నుంచి మొగల్తూరు మామిడి పండ్లు మార్కెట్‌లోకి రావడం మొదలై జూలై రెండు, మూడు వారాలతో ముగుస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే అకాల వర్షాలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు పండు ఈగ ఉద్ధృతి పెంచేందుకు దోహదం చేశాయి. మొదట్లో ఈదురుగాలుల ప్రభావంతో కాయలు రాలిపోయి నష్టపోతే తర్వాత పండు ఈగ తమను కోలుకోలేని దెబ్బతీసిందని రైతులు అంటున్నారు. ఈగల వల్ల కాయలపై మచ్చలు ఏర్పడటం, సకాలంలో వినియోగించకపోతే పండు లోపల పురుగు పడుతుండటం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ఢిల్లీ, రాజస్తాన్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తోటల వద్దకే వచ్చి టన్నుల్లో ఆర్డర్లు ఇస్తే, ఈ ఏడాది మార్కెట్‌కు తెచ్చినా కోత కూలి, రవాణా ఖర్చులు కూడా రానంతగా అమ్మకాలు దిగజారాయని చెబుతున్నారు. చిరు వ్యాపారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడే మొగల్తూరు, నరసాపురం, సీతారామపురం మార్కెట్లు వెలవెలబోతున్నాయి. సాధారణంగా తెల్లవారుజాము మూడు గంటలకు మార్కెట్లు మొదలై తెల్లవారేసరికి ముగిసిపోతుంటాయి. ప్రస్తుతం తెచ్చిన సరుకు ఉదయం 10 గంటల వరకు కూడా అమ్ముడుపోని పరిస్థితి ఉంటోందని వ్యాపారులు అంటున్నారు.

నష్టాల్లో రైతులు

గతంలో టన్ను మామిడి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్మకాలు చేస్తే ఈ ఏడాది రూ.15 వేల నుంచి రూ.25 వేల లోపే ఉంటోందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. చెట్ల సైజు, సంఖ్యను బట్టి ఎకరాకు లీజు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండగా, జూలై, ఆగస్టు నెలల్లో చెట్ల మొదలులో మందులు, ఎరువులు పెట్టడం, డిసెంబరులో పూత మొదలైన నాటి నుంచి జూలైలో కాపు పూర్తయ్యేవరకు రేయింబవళ్లు తోటల వద్ద కాపలా, కోత, మార్కెట్‌కు తరలింపు తదితర రూపాల్లో రూ.లక్ష వరకు ఖర్చులు అవుతున్నాయంటున్నారు. మార్కెట్‌లోకి తెచ్చి అమ్మితే పెట్టుబడి ఖర్చులు కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. గతంలో నాలుగుసార్లు మందులు పిచికారీ చేస్తే సరిపోయేదని, ఈసారి ఏడు సార్లు పిచికారీ చేసినా ఖర్చులు పెరిగాయే తప్ప ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ప్రతికూల వాతావరణం పండు ఈగ వ్యాప్తికి కారణమైందని ఉద్యాన వన శాఖ అధికారులు తెలిపారు. కొందరు రైతులు మొదట్లోనే కాయలపై ఈగలు వాలకుండా కవర్లు (కవర్‌ కల్చరింగ్‌) కట్టే విధానాన్ని పాటించి సత్ఫలితాలు పొందారన్నారు. దాదాపు రెండు లక్షల కవర్లు కట్టినట్టు అధికారి ఒకరు తెలిపారు. పూర్తిస్థాయిలో రైతులు అందరూ ఈ విధానాన్ని అవలంబించేలా కార్యాచరణ చేస్తున్నట్టు వివరించారు.

పండు ఈగ కాటుకు రైతులు విలవిల

గతంలో టన్ను మామిడికి రూ.40 వేలకు పైగా రాబడి

టన్ను రూ.15 వేల నుంచి రూ. 25 వేల లోపే అమ్మకాలు

లీజు, పెట్టుబడి ఖర్చులు రావడం లేదని వాపోతున్న రైతులు

మొగల్తూరు, నరసాపురం మండలాల్లో 1800 ఎకరాల్లో సాగు

మొగల్తూరు మామి‘డీలా’1
1/2

మొగల్తూరు మామి‘డీలా’

మొగల్తూరు మామి‘డీలా’2
2/2

మొగల్తూరు మామి‘డీలా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement