
ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు ప్రోత్సహించాలి
భీమవరం: ప్రభుత్వ పాఠశాలలో చేరికలపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు విద్యాబోధనపై ఇంటింటి ప్రచారం ద్వారా తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో టెన్త్ పరీక్ష ఫలితాలు, ప్రభుత్వ పాఠశాలలో చేరికలు, అల్పాదాయ వర్గాల పిల్లలకు 25 శాతం సీట్ల కేటాయింపు, బడి బయట పిల్లలు చేరికలు, ఆపార్ ఐడీ నమోదు అంశాలపై అధికారులతో సమీక్షించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగాలన్నారు. టెన్త్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగు సమాచారంతో రూపొందించిన కరపత్రం, వాల్పోస్టర్ ఆవిష్కరించారు.
అధికారులు మరింత కృషి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులు మరింత కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, ఆధార్ నమోదు, మిస్సింగ్ సిటిజనన్స్, మనమిత్ర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. లక్ష్య సాధనకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటి పన్ను వసూళ్ల వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆధార్ నమోదు కాని పిల్లలకు సత్వరమే ఆధార్ నమోదు చేసే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, వారి హక్కులపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016 అనుబంధం మార్గదర్శకాలు అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టం అమలుపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 15 రోజుల్లో జిల్లా అధికారులకు వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు.