
వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు
సాక్షి, భీమవరం: వెన్నుపోటు రాజకీయాలకు సీఎం చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి తల్లులు, పిల్లలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాలనూ వంచన చేస్తూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత, పీడిత ప్రజల పక్షాన ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఏమైపోయారో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆయన కోసం కాపు కాసిన వారికి న్యాయం చేయలేకపోతున్నారన్నారు. కాపు సామాజికవర్గంలో మెజారిటీ వర్గం పేదవారేనని, వారికి కాపు నేస్తం, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి తదితర ఏ పథకం అందడం లేదన్నారు. ప్రజల కోసం సీఎం చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.
అన్ని వర్గాలనూ ఆదుకున్న ఘనత జగన్దే..
అన్ని వర్గాలనూ ఆదుకున్న ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని కారుమూరి చెప్పారు. తమ ప్రభుత్వంలో పేదలకు పథకాలు ఇవ్వబట్టే సంక్షేమం, అభివృద్ధి జరిగిందని తెలిపారు. నేడు వ్యాపారాలే లేవని, టోకుగా సొమ్ము మొత్తం దుబాయికో, సింగపూర్కో తరలించేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం జగన్ హయాంలో రూ.3.31 లక్షల కోట్లు అప్పుచేశారని అసెంబ్లీలో చెప్పిన మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లు అంటూ బయట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనది నోరా? తాటిపట్టా? అని ప్రశ్నించారు. కూటమి పాలనలో మర్డర్లు, ఇళ్లు కూల్చడాలు, ఇష్టానుసారంగా కేసులు పెట్టడాలు, డైవర్షన్ రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తండేల్ సినిమాలో చూపించినట్లు ఇక్కడ జెట్టీలు లేక మత్స్యకారులు గుజరాత్కు వెళుతుంటే.. 6 జెట్టీలు కట్టించిన మంచి మనసున్న వ్యక్తి మాజీ సీఎం జగన్ అన్నారు. ఆరు పోర్టులు, జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కళాశాలలు కట్టారని చెప్పారు. మెడికల్ కాలేజీలకు 750 మెడికల్ సీట్లు వస్తే వద్దని లేఖ రాసిన గొప్ప సీఎం చంద్రబాబునాయుడని కారుమూరి ఎద్దేవా చేశారు.
మళ్లీ రేషన్ కోసం గంటల తరబడి క్యూ..
తణుకు అర్బన్: సంపద సృష్టిస్తామని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్నారని, ఉద్యోగాలిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు తొలగించారని కారుమూరి మండిపడ్డారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎండీయూ ఆపరేటర్లందరినీ రోడ్డుకు ఈడ్చారని, రేషన్ దుకాణాల వద్ద మళ్లీ క్యూలో నిల్చునే పరిస్థితితోపాటు బియ్యం మూటలను ఇంటికి మోసుకుని వెళ్లే రోజులను తీసుకువచ్చారన్నారు. ఒక ఎమ్మెల్యేని మించి మరొక ఎమ్మెల్యే మద్యం, పేకాట, క్రికెట్ బుకీలే ఆదాయ వనరుగా మార్చుకుని మహిళల మంగళసూత్రాలను కూడా అమ్మించే పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. ఇంకా ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయలేదని తప్పుపట్టారు. ఏడాదిలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారన్నారు.
4న వెన్నుపోటు దినం
వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ఈనెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా గుర్తించి ఆయా నియోజకవర్గాల పరిధిలో తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి పాలన సాగిస్తున్నారు
పవన్కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు?
మాజీ మంత్రి కారుమూరి ధ్వజం