
శివారు గ్రామాల సంగతి ఏంటి?
రేషన్ కోసం కిలోమీటర్లు వెళ్లిల్సిన దుస్థితి
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక వృద్ధుల అవస్థలు
దెందులూరు: జూన్ 1 నుంచి అమలు చేస్తున్న రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ అనేక మంది లబ్ధిదారులను ఇక్కట్లకు గురిచేస్తోంది. 90 శాతం శివారు గ్రామాల్లో రేషన్ షాపులు లేవు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గడపగడపకు రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేశారు. రేషన్ షాపులు లేని శివారు గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో ఇంటి ముంగిట రేషన్ సరుకులు అందాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా ముద్ర కనపడకూడదన్న శివారు గ్రామాల్లో రేషన్ షాపు లేకపోవడంతో రేషన్ షాపులు ఉన్న గ్రామాలకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాను పోను రెండు కిలోమీటర్లు దూరంతో పాటు ఒక పూట కూలి పని మానుకొని షాపుకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాలి. శివారు గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో రేషన్ షాపులు లేని చోట ఎవరు తెచ్చి ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .రేషన్ షాపులు లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా కక్షపూరితంగా రద్దు చేసినట్టు ఉందని ప్రశ్నిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో బీసీ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గ ప్రజలే అధికంగా జీవిస్తున్నారని వారి హక్కులు పరిరక్షించకుండా పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రేషన్ డీలర్ల సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.
60 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటికి వెళ్లి రేషన్ ఎప్పుడు ఇస్తారు.. ఎలా చెల్లిస్తారు అనే విషయంలో లిఖితపూర్వక హామీ ఆదేశాలు లేవు. తమకు స్పష్టమైన ఆదేశాలు లేకపోతే యూనియన్ పరంగా నిర్ణయం తీసుకుంటామని డీలర్ల యూనియన్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరికీ రేషన్ సరుకులు అందకపోయినా, ఏర్పాట్లు చేయకపోయినా దళిత గిరిజన మైనారిటీ బీసీ సంఘాలు ఏకమై భవిష్యత్ ప్రణాళికను ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు.
తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన :
ఏలూరు జిల్లాలో శివారు, అటవీ ప్రాంతాల్లో షాపులు లేకుండా సరుకులు ఎలా ప్రజలకు అందిస్తారని, శివారు గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికంగా రేషన్ షాపులు తక్షణమే ఏర్పాటు చేయాలి అలా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆదివారం దెందులూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర మాలసేన నాయకులు గంటా పండు నిరసన వ్యక్తం చేశారు.