
సమరగ అభివృద్ధి లక్ష్యం
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్ రూపొందించడంపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల వారీగా స్వర్ణాంధ్ర–2047 విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు అధికారులకు రెండు రోజుల వర్క్షాపు సోమవారం ప్రారంభమైంది. ఉభయ జిల్లాల చీఫ్ ప్లానింగ్ అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ సిబ్బందికి కలెక్టర్ సూచనలు ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల మనోభావాలు అనుగుణంగా యాక్షన్ ప్లాన్కు రూపొందించాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపు, సుస్థిర, పర్యావరణ అనుకూలమైన వృద్ధి, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపు, భవిష్యత్ నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన, శ్రామికశక్తిని ప్రోత్సాహం అందించడంపై దృష్టి సారించాలన్నారు. నియోజక వర్గాల వారీ గా సమర్థవంతమైన ప్రణాళికలు అమలుచేయాల్సి ఉందన్నారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య రంగాల్లో ప్రస్తుత విస్తరణ, దిగు బడులు, రానున్న రోజుల్లో అంతర సాగు విధానం, ఆదాయం పెంపు, ప్రకృతి సాగు విస్తీర్ణం పెంపు తదితర అంశాలను ప్రణాళికలో పొందుపరచాలన్నారు. ఉమ్మడి జిల్లాల ముఖ్య ప్రణాళిక అధికారులు సీహెచ్ వాసుదేవరావు, కె.శ్రీనివాసరావు, రిటైర్డ్ జేడీ డీవీవీ సీతాపతిరావు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.