
సంచార పశు వైద్యశాలలకు గ్రహణం
దెందులూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వ హయాంలో పశువులకు ఇంటి వద్ద మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంచార పశు వైద్య సేవలు ప్రవేశపెట్టారు. వాహనంలో, డాక్టర్ హెల్త్ అసిస్టెంట్, డ్రైవర్ ఉంటారు. పశువులకు సంబంధించిన అన్ని మందులు ఉంటాయి. ఒక్కో నియోజకవర్గానికి రెండు సంచార వైద్య సేవల వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సేవల కోసం 1962 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతు ముంగిట ఈ సేవలు గుర్తింపు పొందాయి.
ఫోన్ చేస్తే 20 నిమిషాల్లోపు వాహనం రావడంతో మెరుగైన వైద్య సేవలు సాధ్యమ్యేవి. ఒక వాహనానికి ఏడాదిలో 720 కాల్స్ వచ్చేవి. 14 వాహనాలకు దాదాపు 10 వేలకు పైగా కాల్స్ అందేవి. గత నాలుగు సంవత్సరాలలో 14 వాహనాలకు సంబంధించి 56,480 కాల్స్ ద్వారా ఐదు లక్షలకు పైగా పశువులకు వైద్య సేవలు అందించారు. గత నెల నుంచి జిల్లాలో ఉన్న 14 సంచార పశువైద్యశాలలకు సంబంధించి 7 వాహనాలు నిలిచిపోయాయి. 7 వాహనాలు మాత్రమే సేవలందిస్తున్నాయి.
దీంతో సకాలంలో పశువులకు వైద్యం అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. నిలిచిపోయిన ఏడు వాహనాలను వెంటనే ప్రారంభించి వైద్య సేవలు అందించేలా చూడాలని రైతులకు కోరుతున్నారు.
నెలరోజులుగా నిలిచిపోయిన ఏడు వాహనాలు
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సేవలు అమోఘం
వాహనాలను పునరుద్ధరించాలి
నోరులేని మూగజీవాల పట్ల కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కనికరం చూపాలి. నిలిచిపోయిన ఏడు సంచార పశు వైద్య వాహనాలను తిరిగి పునరుద్ధరించాలి. పూర్తిస్థాయిలో అనారోగ్యం ఉన్న ప్రతి పశువుకు ఇంటి ముంగిటకు వైద్య సేవలు అందేలా చూడాలి. నెల రోజుల్లోగా జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.
– కట్టా ఏసుబాబు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి
కాంట్రాక్ట్ ముగిసిపోవడం వల్లే
ఫస్ట్ పేజ్లో మంజూరు చేసిన ఏడు సంచార వైద్య వాహనాల ఏజెన్సీ కాంట్రాక్ట్ ముగిసింది. త్వరలోనే ప్రభుత్వం తిరిగి మరో ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇస్తుంది.
– గోవిందరాజు, జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ, ఏలూరు
ఏలూరు జిల్లాలో పశువుల వివరాలు
గేదెలు 5,06,610
ఆవులు 1,35,607
గొర్రెలు 5,26 836
మేకలు 1,98,810
కోళ్లు 1,02,78,022

సంచార పశు వైద్యశాలలకు గ్రహణం

సంచార పశు వైద్యశాలలకు గ్రహణం