
వాసవీ కన్యకా పరమేశ్వరి మాత మూలవిరాట్
పెనుగొండ : ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆదివారం మూలవిరాట్ వాసవీ మాత వేంచేసియున్న శ్రీనగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా నిర్వహించనున్నారు. తొలుత నగరేశ్వరస్వామికి, వాసవీ కన్యకా పరమేశ్వరి, మహిషాసురమర్దని అమ్మవార్లకు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకు వాసవీ దీక్షధారులతో బజారు రామాలయం నుంచి 102 కలశాలు, వెండి పల్లకీ ఊరేగింపు నిర్వహి స్తారు. అనంతరం వాసవీ మహాయాగం, గణపతి పూజ, వాసవీ పూజ, పూర్ణహుతితో వాసవీ దీక్ష విరమణ చేస్తారు. రాత్రి నిప్పుల గుండం, అన్నసమారాధన నిర్వహించనున్నారు.
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
ద్వారకాతిరుమల: కొమ్మరలో విద్యుత్ లైన్ నిర్మాణం కోసం స్తంభం ఎక్కిన ఓ యువకుడు షాక్కు గురై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ కు చెందిన యువకుడు బ్రోజన్ (22) ఒక కాంట్రాక్టర్ వద్ద విద్యుత్తు లైన్ల నిర్మాణ పనులు చేస్తున్నాడు. కొమ్మరలోని ఒక సెల్ఫోన్ టవర్ వద్ద ఉన్న విద్యుత్ లైన్ను మార్చేందుకు బ్రోజన్ స్తంభం ఎక్కాడు. కొమ్మర, రాళ్లకుంట ఫీడర్ల లైన్లు ఉండగా, బ్రోజన్ కొమ్మర ఫీడర్కు మాత్రమే ఎల్సీ తీసుకున్నాడు. అయితే రాళ్లకుంట ఫీడర్ వైర్లను పట్టుకోవడంతో షాక్కు గురై స్తంభం పైనే మృతి చెందాడు. భీమడోలు సీఐ భీమేశ్వర రవికుమార్, ద్వారకాతిరుమల ఎస్సై సతీష్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపి పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.