
రిజిస్ట్రార్ కార్యాలయానికి ‘దారి’ చూపారు
ఉండి: ‘నీరు నిలిస్తే దారి గల్లంతే’ శీర్షికను ఈనెల 26న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఉండిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దారి బురదతో నిండి ఉండటంతో చర్యలు తీసుకున్నారు. కార్యాలయ ముఖ ద్వారంతో పాటు కార్యాలయం చుట్టూ మెటల్ (చిప్స్) వేసి మరమ్మతులు చేపట్టారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
కాల్ సెంటర్ అర్జీలపై ప్రత్యేక దృష్టి
భీమవరం (ప్రకాశంచౌక్): సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన 1100 కాల్ సెంటర్కు అందిన అర్జీల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కాల్ సెంటర్ అర్జీల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలను నిర్ణీత గడువులోపు క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కరించాలన్నారు. అలాగే పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని, చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, డీపీఓ రామ్నాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ మీటర్ రీడర్లసమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమావేశాన్ని ఏలూరులో యూనియన్ జిల్లా కోశాధికారి మల్లేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పి.కిషోర్ మాట్లాడుతూ ఎస్క్రో అకౌంట్ను తక్షణమే ఓపెన్ చేయాలని, మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు పి.జాకబ్ మాట్లాడుతూ మీటర్ రీడర్లు కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లా సహాయ కార్యదర్శులు ఎ.దుర్గారావు, స్వామి, శంకర్ అప్పారావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ఫీల్డ్ పనులను అడ్డుకున్న రైతులు
జంగారెడ్డిగూడెం: గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో పొలాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని పుట్లగట్లగూడెం గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద రైతులు రాస్తారోకో చేసి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైవే సర్వీస్ రోడ్డు పక్క నుంచి పొలాలకు వెళ్లే దారి ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా సర్వీసు రోడ్డు నిర్మాణం చేపట్టారన్నారు. అలాగే హైవే పక్కనే ఉన్న కొంగల చెరువు సర్ప్లస్ వాటర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే మురుగు కాలువను పూడ్చడంతో వరద ముంపు నీరు పొలాలను ముంచెత్తుతోందన్నారు.

రిజిస్ట్రార్ కార్యాలయానికి ‘దారి’ చూపారు

రిజిస్ట్రార్ కార్యాలయానికి ‘దారి’ చూపారు