
జిల్లాలో ప్రహసనంగా నియామక ప్రక్రియ
జిల్లాలో ప్రహసనంగా నియామక ప్రక్రియ
సీనియారిటీ జాబితాలో పేర్లు, నంబర్లు మారాయని అభ్యర్థుల ఆరోపణ
నేడు కలెక్టరేట్లో జీపీఓలకు కౌన్సెలింగ్
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఎంపికై న గ్రామ పాలనాధికారుల (జీపీఓలు)కు కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం కలెక్టరేట్లో కౌన్సెలింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వనున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఒక్క హనుమకొండ జిల్లాలోని అధికారులు నియామక ప్రక్రియను ప్రహసనంగా మార్చారని ఆరోపణలు వచ్చాయి. ఒకవైపు ఆప్షన్లు తీసుకున్న అధికారులు అసలు జాబితా, అభ్యర్థుల వివరాలు వెల్లడించలేదని విమర్శలు ఉన్నాయి.
దీనికి తోడు సీనియారిటీ జాబితాలో నాన్ లోకల్ లోకల్ క్యాడర్లో వేరే విధంగా చూపెట్టినప్పటికీ.. లోకల్ క్యాడర్లో చూపెట్టిన కొందరు అభ్యర్థుల్లో నాన్లోకల్ వారు ఉన్నారని, వేరే జిల్లాల్లో పరీక్షలు రాసిన వారిని ఇక్కడి జిల్లా అభ్యర్థుల జాబితాలో చూపెట్టారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. కానీ, హనుమకొండ జిల్లాలో మాత్రం అధికారులు ఈ ప్రక్రియ సాగదీయడం అనుమానాలకు తావిస్తోంది.
స్థానిక నియోజకవర్గం కాకుండా..
ప్రస్తుతం జిల్లాకు కేటాయించిన 128 మందిని మొదట వారి నుంచి ఆప్షన్స్ స్వీకరించారు. ఇందులో ప్రాధాన్యతా క్రమంలో 14 మండలాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసుకున్న మండలాల్లో ఏ గ్రామానికి కేటాయించాలన్నది మాత్రం అధికారుల ఇష్టంగా చూపెట్టారు. మండలం మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో మండలంలో ఉన్న ఖాళీల ఆధారంగా వారికి ఇష్టం ఉన్న గ్రామాలు అధికారులు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గం కాకుండా ఇతను నియోజకవర్గానికి కేటాయించాలని నిబంధనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వారి సొంత నియోజకవర్గానికి కేటాయించాల్సి వస్తే.. ఆ నియోజకవర్గంలో వారి సొంత మండలం కాకుండా ఇతర మండలాలకు కేటాయిస్తామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా అర్బన్ మండలాలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతోపాటు ఒక మండలంలో నాలుగు గ్రామాలు ఉంటే.. వాటిలో రెండు గ్రామాలు హెచ్ఆర్ఏ కింద ఉన్నాయి ఇలాంటి మండలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అభ్యర్థులు సైతం ఈ విషయంలోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు 128 మందిలో కొందరు స్థానికులు కారని, వేరే మండలాల్లో పరీక్షలు రాసి అక్కడ స్థానికత చూపెట్టుకున్నారని, వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అక్కడే పూర్తయిందని, జాబితాలో మాత్రం ఇక్కడి వారీగా చూపెడుతుండడంతో తాము సీనియార్టీ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అగ్నికి ఆజ్యం పోసినట్టు సీనియారిటీ జాబితాలో కూడా పేర్లు, నంబర్లు మూడు రోజుల్లో మూడుసార్లు మారినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ నియామక ప్రక్రియ నిర్వహిస్తున్న సెక్షన్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.
జిల్లాలో 128 మంది..
హనుమకొండ జిల్లాకు మొత్తం 128 మంది జీపీఓలను ప్రభుత్వం కేటాయించింది. కాగా, వీరిని జిల్లాలోని 164 రెవెన్యూ గ్రామాలకు కేటాయించాల్సి ఉంది. రెవెన్యూ గ్రామాల వారీగా కాకుండా జిల్లాలో 123 రెవెన్యూ క్లస్టర్లు ఏర్పాటు చేసి క్లస్టర్కు ఒకరు చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. జిల్లాకు వచ్చిన 128 మందిలో ఒకరు మెడికల్ గ్రౌండ్లో తిరిగి వెనక్కి వెళ్లారు. మిగిలిన వారిలో 121 మంది లోకల్ కేటగిరీలో చూపారు. ఆరుగురిని నాన్ లోకల్ కేటగిరీలో అంటే కరీంనగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి వచ్చినట్లు చూపెట్టారు. పోస్టులు మొదట లోకల్ వారికి తర్వాత నాన్ లోకల్ వారికి ఇవ్వనున్నారు. అదేవిధంగా రెండోసారి జీపీఓ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన వారిలో మొదట లోకల్ వారికి తర్వాత నాన్లోకల్ వారికి పోస్టులు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా రిజర్వేషన్ రోస్టర్ అమలు చేసే పరిస్థితి లేనందున కేవలం వారి వివరాలు నమోదు చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.