
భద్రకాళీ మాడవీధుల పనుల్లో వేగం పెంచండి
నయీంనగర్: భద్రకాళి మాడవీధుల నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం భద్రకాళి ఆలయ మాఢవీధుల పనులు, చెరువులో ఏర్పాటు చేస్తున్న ఐలాండ్ పనుల పురోగతిని కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలను సందర్శించి మిగిలిన భూసేకరణను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ‘కుడా’ పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీమ్రావు, భద్రకాళి పూజారి శేషయ్య, ఈఓ శేషు భారతి తదితరులు ఉన్నారు.
ప్రయాణికుల భద్రతకు
ఆర్టీసీ ప్రాధాన్యం
హన్మకొండ: ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ డ్రైవర్లు సురక్షిత డ్రైవింగ్ చేయాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను సూచించారు. సోమవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ఆర్ఎం డి.విజయభాను మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రమాదాలు లేని వరంగల్ రీజియన్గా తీర్చిదిద్దేందుకు ఆర్టీసీ, అద్దె బస్సు, జేబీఎం బస్ డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మద్యం ముట్టుకోవద్దని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషి చేయాలని కోరారు.
ప్రొఫెసర్ శ్రీలతకు అవార్డు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ సీజే శ్రీలతకు ఉమెన్ లీడర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవార్డు లభించింది. శ్రీలతకు బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రముఖ సంస్థ ది అకడమిక్ ఇన్సైట్స్ నుంచి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారం మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నత విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న మహిళలకు అందజేస్తారు. అవార్డుపై సోమవారం యూనివర్సిటీలో శ్రీలత మాట్లాడుతూ.. ఇది మహిళా నాయకత్వానికి గుర్తింపు అని పేర్కొన్నారు. ఈసందర్భంగా శ్రీలతను కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం అభినందించారు.
క్రికెట్ సంఘం బాధ్యులపై
పోలీసులకు ఫిర్యాదు
వరంగల్ స్పోర్ట్స్: హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుతో పాటు వరంగల్ క్రికెట్ సంఘం కార్యదర్శి శ్రీనివాస్పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సోమవారం ‘ది తెలంగాణ క్రికెట్ సంఘం’ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ విజయ్చందర్రెడ్డి, టి.జయపాల్ వరంగల్ సీపీ ఆఫీస్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 20 ఏళ్లుగా బీసీసీఐ, హెచ్సీఏ, క్లబ్ సభ్యుల ద్వారా వరంగల్ జిల్లా సెక్రటరీగా శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా క్రికెట్ అభివృద్ధికి రావాల్సిన నిధులను తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాంతీయ క్రీడాకారుల ప్రతిభను నిర్లక్ష్యం చేసి, క్రికెట్ పాలనను స్వార్థపూరితంగా మలుపుతిప్పారన్నారు. అవినీతికి పాల్పడ్డవారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
నేటి నుంచి టీటీడీ
సాంస్కృతిక కార్యక్రమాలు
హన్మకొండ కల్చరల్: నేటి నుంచి 19వ తేదీ వరకు టీటీడీ, డీపీపీ(ధర్మ ప్రచార పరిషత్) ఆధ్వర్యంలో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కార్యక్రమ నిర్వాహకులు రామిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం హనుమకొండ భవానీనగర్లోని భవానీమాత దేవాలయంలో కార్యక్రమాల బ్యానర్ను ఆవిష్కరించారు. రామిరెడ్డి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. శ్రీభవా నీమాత దేవాలయంలో నేటి(మంగళవారం) నుంచి 17వ తేదీ వరకు విజయవాడకు చెందిన మండలిక శ్రీకృష్ణకుమార్ శ్రీవెంకటాచల మహత్యంపై ధార్మిక ప్రవచనాలు, 18న కుంకుమ పూజ, 19న టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.