కేజీబీవీలో బెడ్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలో బెడ్ల పంపిణీ

Jun 26 2025 6:04 AM | Updated on Jun 26 2025 12:40 PM

సంగెం: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుకునే పేద విద్యార్థినులకు వసతి కల్పించేందుకు విరాళం అందించామని రోటరీ క్లబ్‌ ఆర్‌ఐ 3150 డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ కాట్రగడ్డ శరత్‌చౌదరి తెలిపారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 160 మంది విద్యార్థినులకు ఉపయోగపడే రూ.9 లక్షల విలువైన 80 బంక్‌ బెడ్స్‌ బుధవారం అందజేశారు. ఇందులో రూ.8 లక్షలు రోటరీ క్లబ్‌ ఆఫ్‌ వరంగల్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ జూబ్లీహిల్స్‌, బీజీఆర్‌ మైన్స్‌, రరూ.ఒక లక్ష కేజీబీవీఎస్‌ ద్వారా దాతల సహకారంతో సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు ఇష్టంతో చదవాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ వరంగల్‌ రిటైర్డ్‌ ప్రెసిడెంట్‌ కురువెల రాజగోపాల్‌రావు, రిటైర్డ్‌ ప్రతినిధులు గంట వేణుగోపాల్‌, బాలకోటి, రాంప్రసాద్‌, ఎంఈఓ రాము, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ నీలిమ, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన

కార్యదర్శిగా మహేందర్‌రెడ్డి

నల్లబెల్లి: పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నల్లబెల్లి మండల అధ్యక్షుడు నక్కిరెడ్డి మహేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. హనుమకొండలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులను కాపాడుతూ, సంఘం బలోపేతానికి కృషిచేస్తానని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

వర్ధన్నపేట: సాగుకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించాలని సీఈ రాజుచౌహాన్‌ అన్నారు. మండలంలోని ఇల్లంద సబ్‌స్టేషన్‌లో పీటీఆర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్‌ ఎస్‌ఈ గౌతమ్‌రెడ్డి, డీఈ హర్జినాయక్‌, ఏడీఈలు కన్న రాజు, సర్వేశ్వర్‌, నటరాజు, ఏఈ తరుణ్‌, లైన్‌మన్‌ లక్ష్మణ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నర్సంపేట రూరల్‌: మహేశ్వరం గ్రామంలోని ప్రభుత్వ అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 5, 6, 7 తరగతుల్లో ప్రవేశానికి బాలురు దరఖాస్తు చేసుకోవాలని స్పెషలాఫీసర్‌ ఇషాక్‌ అలీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 6281886163, 8106041201 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

వర్ధన్నపేట, రాయపర్తి పీఎస్‌లను తనిఖీ చేసిన సీపీ

వర్ధన్నపేట/రాయపర్తి: వర్ధన్నపేట, రాయపర్తి పోలీస్‌స్టేషన్లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ల పరిసరాలు పరిశీలించి మొక్కలు నాటారు. రికార్డులు తనిఖీ చేశారు. అలాగే, వివిధ కేసుల పురోగతి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వెస్ట్‌జోన్‌ డీసీసీ రాజమహేంద్రనాయక్‌, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్సైలు చందర్‌, రాజు, ముత్యం రాజేందర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా శ్రవణ్‌కుమార్‌

నల్లబెల్లి: ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్‌ శ్రవణ్‌కుమార్‌ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నమ్మకంతో తనను కన్వీనర్‌గా నియమించిన ఏబీవీపీ రాష్ట్ర శాఖ ప్రతినిధులకు శ్రవణ్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.

కేజీబీవీలో బెడ్ల పంపిణీ1
1/1

కేజీబీవీలో బెడ్ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement