
నేటినుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్లోని శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని భద్రకాళి ఆలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి అన్నారు. ఈ మేరకు ఆలయంలోని అన్నదాన సత్రం ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శేషుభారతి, ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం శేషుభారతి మాట్లాడుతూ 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరుగనున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గురువారం సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ రోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, జూలై 10వతేదీ గురువారం ఉదయం 4గంటలకే మహాశాకంబరీ అలంకరణ, పూజలు జరుగుతాయన్నారు. మండలి చైర్మన్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. ఆలయ ధర్మకర్త తొనుపూనూరి వీరన్న మాట్లాడుతూ 11 సంవత్సరాల తర్వాత దేవాలయంలో ధర్మకర్తల మండలి ఏర్పాటు అయ్యిందని, ఆలయ ధర్మకర్తల తరఫున భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవాలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, సిబ్బంది హరినాథ్, అలుగు కృష్ణ, నాగులు, చింతశ్యాంసుందర్ పాల్గొన్నారు.
కనీస సౌకర్యాలు కల్పించాలి...
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరీ ఉత్సవాల్లో గతంలో భక్తులకు కనీససౌకర్యాలు కల్పించలేదని విలేకరులు ఈఓ శేషుభారతిని ప్రశ్నించారు. దేవాలయంలో శానిటేషన్, టాయిలెట్ల ఏర్పాటు చేయాలని, క్యూలైన్లో భక్తులకు మినరల్ వాటర్, ప్రసాదాలు అందజేయాలని, ఆలయ ఆవరణ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి ఈఓ స్పందిస్తూ భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తానని సమాధానమిచ్చారు.
జూలై 10వ తేదీ వరకు నిర్వహణ
మహోత్సవాలను విజయవంతం చేయాలి
భద్రకాళి దేవాలయ ఈఓ శేషుభారతి
ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

నేటినుంచి శాకంబరీ ఉత్సవాలు