
మత్తు పదార్థాలు నివారించాలి
న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ అంకిత్కుమార్తో కలిసి బుధవారం జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, నషా ముక్త్ భారత్లో భాగంగా చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో జీవితం ఎలా నాశనం అవుతుందో వీడియో ప్రదర్శనల ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో తప్పనిసరిగా తనిఖీలు చేయాలని, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా యువతలో చైతన్యం తేవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన జిల్లాకు చెందిన 24 కుటుంబాలకు బీమా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ రమేశ్, అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించాలి
స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల స్వచ్ఛతను అంచనా వేయడానికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025 ద్వారా జిల్లాలకు ర్యాంకులు ప్రకటిస్తుందన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత పెంపొందించడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అధికారులు కృషిచేయాలని ఆమె సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సమస్య లేదని చెప్పారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మానసపల్లి ఇసుక రీచ్ నుంచి మెట్రిక్ టన్నుకు రవాణా చార్జీలతో కలిపి సుమారు 550 రూపాయలతో పొందవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల తెల్ల రేషన్కార్డుల సర్వే 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..
బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరం జిల్లాలోని బీఏఎస్ స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. యాజమాన్యాలు సహకరించి వెంటనే విద్యార్థులను స్కూళ్లకు అనుమంతించాలని కలెక్టర్ కోరారు.
9 అంశాలను పరిశీలించాలి..
పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లోని 9 అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పూరిస్తే వాటి ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారని కలెక్టర్ సత్యశారద అధికారులకు తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద