
తాత్కాలిక ఉద్యోగుల రెన్యువల్ నిలిపివేత!
సాక్షి, వరంగల్: దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా విచారణ తుది అంకానికి చేరుకుంటున్న క్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల రెన్యువల్ అర్ధాంతరంగా నిలిపివేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. వీరి పనితీరు బాగా లేకపోవడంతో కాంట్రాక్ట్ కాలాన్ని పునరుద్ధరించలేమని జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి బుధవారం ఉత్తర్వులిచ్చారని తెలిసింది. కాంట్రాక్ట్ రెన్యువల్ కానివారిలో రాజు, సరిత, సురేశ్, ప్రణయ్, నర్సింహస్వామి, పద్మలత,, ఎన్.రాజు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడుగురు ఉద్యోగుల్లో దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందాలో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారనే ప్రచారం ఉంది. విధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. పనితీరు బాగాలేదనే కారణంతో మిగిలినవారి కాంట్రాక్ట్ పునరుద్ధరించకపోవడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న కలెక్టరేట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలోనే చేయాల్సిన ఈ తాత్కాలిక ఉద్యోగుల రెన్యువల్ను ఇప్పటివరకు ఆపి అకస్మాత్తుగా తెరమీదకు తీసుకొచ్చి నిలిపివేయడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కాగా, జిల్లా సంక్షేమ విభాగంలోని కొందరు అధికారులు ఈ దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం, గతంలో వీహబ్, చైల్డ్లైన్ ఉద్యోగ నియామకాల్లో అనర్హులకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం, నకిలీ సర్టిఫికెట్లతో వీహబ్లో ఉద్యోగం పొందిన ఓ మహిళ ఏడాదికిపైగా ఉద్యోగం చేసి ఇటీవల పోలీసు కేసు కావడం తదితర కారణాలు తమకు గుదిబండగా మారుతాయనే ఉద్దేశంతోనే ‘ప్రదర్శన బాగా లేదంటూ’ కావాలనే జిల్లా ఉన్నతాధికారిని తప్పుదోవ పట్టించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఏడాది వీరి పనితీరు మరోసారి పరిశీలిస్తే అర్హులకు న్యాయం జరుగుతుందని, దీనిపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా విచారణ వేళ నిర్ణయం
పనితీరు బాగా లేదంటూ ఏకంగా
ఏడుగురిపై అధికారుల వేటు
తాజా చర్యలతో మరోసారి చర్చల్లో
జిల్లా సంక్షేమ విభాగం