నత్తనడకన ఇళ్ల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన ఇళ్ల నిర్మాణం

Jun 24 2025 3:19 AM | Updated on Jun 24 2025 3:19 AM

నత్తనడకన ఇళ్ల నిర్మాణం

నత్తనడకన ఇళ్ల నిర్మాణం

హన్మకొండ: నిరాశ్రయులైన కుటుంబాలకు శాశ్వత గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందించనుంది. అయితే లబ్ధి దారుల ఎంపికలో ఆలస్యం, వెరిఫికేషన్‌కు సమ యం తీసుకోవడం, ప్రొసీడింగ్స్‌ జారీలో జాప్యం తదితర కారణాలతో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రొసీడింగ్స్‌ జారీ వరకు ప్రతీ స్టేజీలో ప్రక్రియ ఆలస్యం కావడంతో ముగ్గులు పోసే విషయంలో వెనుకబడిపోయింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు నెలలు ముందు పూర్తి కావాల్సి ఉండగా.. జాప్యం కావడంతో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. దీనికి తోడు లబ్ధిదారుల ఆర్థిక స్థోమత, మెటీరియల్‌ లభ్యత, ముహూర్తాలు లేకపోవడం వంటివి ప్రతిబంధకాలుగా మారాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోలేదు.

వరంగల్‌ జిల్లాలో..

జిల్లాకు 11,004 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా.. 7,734 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చారు. ఇప్పటి వరకు 2,251 ఇళ్లకు ముగ్గు పోశారు. ఇంకా 8,753 ఇళ్లకు ముగ్గు పోయాల్సి ఉంది. హనుమకొండ జిల్లాకు 9,942 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. జిల్లా అధికార యంత్రాంగం 6,358 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చింది. 5,767 ఇళ్ల ప్రొసీడింగ్స్‌ లబ్ధిదారులకు అందించారు. ఇందులో 3,164 ఇళ్లకు ముగ్గు పోశారు. ముగ్గు పోసుకున్న లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టారు.

ఎంపిక.. తలకు మించిన భారం

వరంగల్‌ జిల్లాలో ఇంకా 7,734 మంది, హనుమకొండ జిల్లాలో ఇంకా 3,584 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కత్తిమీద సాముగా మారడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు వేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొదటి ప్రాధాన్యంగా ఇంటి స్థలాలున్న పేదలకే ముందుగా మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇళ్ల స్థలాలుండి సొంతిళ్లు లేని వారిని గుర్తించారు. ఈజాబితాను ఇందిరమ్మ కమిటీ అధికారులకు అందజేసిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం వెరిఫికేషన్‌ అధికారులను నియమించి లబ్ధిదారుల ఎంపిక, స్థల పరిశీలన చేసి తుది జాబితాను రూపొందించారు. ఈప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంది. దీనికి తోడు ప్రొసీడింగ్స్‌ జారీ చేయడంతో పాటు వాటిని గ్రామాల్లో లబ్ధిదారులకు అందించేందుకు ఎమ్మెల్యేలు సమయం తీసుకోవడంతో ఆలస్యంగా నిర్మాణాలు మొదలయ్యాయి.

మంచి రోజులు లేవని..

ప్రస్తుతం ముహూర్తాలు లేకపోవడం, ఆషాడ మాసం రావడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఉపందుకోవడానికి మరో నెల రోజులకుపైగా సమయం పట్టనుంది. ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులకు మించకుండా ఉండాలనే నిబంధన లబ్ధిదారులను కొంత ఇబ్బందికి గురి చేస్తోంది. ఇందులో ఒక హాల్‌, కిచెన్‌, బెడ్రూం, వాష్‌రూం తప్పనిసరిగా ఉండాలి. దీనికి మించిన వైశాల్యంలో ఇళ్లు నిర్మించుకుంటే బిల్లు పొందడానికి అనర్హులవుతారు. ప్రభుత్వం ఇచ్చే సాయానికి తాము కొంత జోడించి విశాలంగా ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తి కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఒకరిని చూసి మరొకరు ఇంటి విస్తీర్ణం పెంచి ఆర్థిక సపోర్టు లభించక మధ్యలోనే నిర్మాణాన్ని వదిలేస్తే ప్రభుత్వానికి ఎక్కడ మచ్చ వస్తుందో అన్న సందేహంతో సర్కారు ఈ నిబంధనను పెట్టినట్లు తెలుస్తోంది. ఆషాఢం పూర్తయి, శ్రావణం వచ్చిన తర్వాత మంచి ముహూర్తాలు వచ్చే వరకు ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసే ప్రక్రియ నిలిచిపోనుంది.

జిల్లాకు కేటాయించిన ఇళ్లు 11,004

పరిపాలనా మంజూరు ఇచ్చినవి 7,734

కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ప్రకటించని

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా

ముహూర్తాలు లేక ఆగిన

ఇళ్ల నిర్మాణాల ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement