నేడు రైతులతో సీఎం ముఖాముఖి | - | Sakshi
Sakshi News home page

నేడు రైతులతో సీఎం ముఖాముఖి

Jun 24 2025 3:19 AM | Updated on Jun 24 2025 3:19 AM

నేడు రైతులతో సీఎం ముఖాముఖి

నేడు రైతులతో సీఎం ముఖాముఖి

ఖిలా వరంగల్‌: సీఎం రేవంత్‌రెడ్డి నేడు (మంగళవారం) రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం –2025కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం ద్వారా విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ముఖాముఖి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 33 రైతు వేదికల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక, నోడల్‌ ఆఫీసర్‌గా నియమించబడిన జిల్లా, మండల స్థాయి అధికారులు, రైతు వేదికల వద్దకు ప్రజా ప్రతినిధులు, రైతులను ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,52,975 మంది రైతుల ఖాతాల్లో రూ.153.47కోట్లు రైతు భరోసా ద్వారా జమచేసినట్లు తెలిపారు.

విధుల నుంచి

ఏఎల్‌ఎం తొలగింపు

పర్వతగిరి: మండలంలోని జమాల్‌పురం గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో విద్యుత్‌ శాఖలో తాత్కాలిక పద్దతిలో విధులు నిర్వహిస్తున్న బాలాజీ తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు పోగొట్టుకున్న విషయం విధితమే. కాగా, నిర్లక్ష్యంగా విధులు నిర్వహించి ప్రమాదానికి కారకుడైన ఏఎల్‌ఎం(అసిస్టెంట్‌ లైన్‌మెన్‌) నిశాంత్‌వర్మను విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధుల నుంచితొలగించినట్లు విద్యుత్‌ శాఖ డీఈ భిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పర్వతగిరి పోలీసులు తెలిపారు.

రుద్రేశ్వరుడికి

ప్రత్యేక పూజలు

హన్మకొండ కల్చరల్‌ : శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జ్యేష్టమాసం బహుళ త్రయోదశి సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి నిత్య పూజల అనంతరం ఆలయ నాట్యమండపంలో శ్రీరుద్రేశ్వరీదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి కల్యాణోత్సవం నిర్వహించారు. ఏర్పాట్లను ఈఓ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

‘నిట్‌’లో జీయాన్‌

వర్క్‌షాప్‌ షురూ

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లోని సివిల్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో జీయాన్‌ (గ్లోబల్‌ ఇన్షియేటివ్‌ ఆఫ్‌ అకాడమిక్‌ నెటవర్క్‌) ఐదు రోజుల వర్క్‌షాప్‌ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీరిపేర్‌ అండ్‌ రీమాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ పార్ట్స్‌ యూసింగ్‌ డైరెక్ట్‌ ఎనర్జీ డీపొజిషన్‌, అడిటివ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ సస్టేనబుల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎట్‌ నిట్‌శ్రీ అంశాలపై ఏర్పాటు చేసిన ఐదు రోజుల వర్క్‌షాప్‌నకు ముఖ్య అతిథులుగా యూఎస్‌ఏలోని యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరీడా ప్రొఫెసర్‌ నవీన్‌ఏలూరు, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఎట్‌ ఆస్టీన్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ బోరెల్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్‌షాప్‌ ప్రారంభించి సావనీర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో జీయాన్‌ కో–ఆర్డినేటర్‌, ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు, సివిల్‌, మెకానికల్‌ హెడ్స్‌ రవికుమార్‌, శంకర్‌, రఘురాం, ఏపీ, తెలంగాణ, కర్నాటక, పాండిచ్చేరి వివిధ విద్యా సంస్ధల నుంచి 60 మంది పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement