
యువత సన్మార్గంలో నడిచి ఆదర్శంగా నిలవాలి
నర్సంపేట రూరల్ : యువత చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడిచి, ఎంచుకున్న రంగంలో రాణించి పలువురికి ఆదర్శంగా నిలువాలని వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు. నర్సంపేట మండలంలోని బాలాజీ ఇంజనీరింగ్ కళాశాల, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో మారకద్రవ్యాల నిరోధక అవగాహన సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. యువత మారకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్ధాలకు బానిసై బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పారు. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు యువత కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై అరుణ్, రవికుమార్, కళాశాల ప్రిన్సిపాల్ హరిహరన్, అధ్యాపకులు పాల్గొన్నారు.
యువత మత్తుకు దూరంగా ఉండాలి
వర్ధన్నపేట : యువత మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని వరంగల్ వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండలంలోని ఇల్లంద జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం సమాజంలో పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. యువత సహకారంతోనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మాధక ద్రవ్యాలు ఎవరైనా విక్రయించినా.. వినియోగించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో మంచిగా చదువుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, ఎస్సైలు చందర్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ ఈస్ట్ జోన్
డీసీపీ అంకిత్ కుమార్

యువత సన్మార్గంలో నడిచి ఆదర్శంగా నిలవాలి