డీబీసీడీఓపై కలెక్టర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

డీబీసీడీఓపై కలెక్టర్‌ ఆగ్రహం

Jun 24 2025 3:19 AM | Updated on Jun 24 2025 3:19 AM

డీబీసీడీఓపై కలెక్టర్‌ ఆగ్రహం

డీబీసీడీఓపై కలెక్టర్‌ ఆగ్రహం

నల్లబెల్లి: బీసీ హాస్టల్‌ పరిశీలన కార్యక్రమం ఉందని ముందస్తు సమాచారం ఉన్నా.. ఎందుకు రాలేదు..? ఇంత నిర్లక్ష్యం ఎందుకు..? ఏమైనా తమాషా చేస్తున్నావా.. అంటూ జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి (డీబీసీడీఓ) పుష్పలతపై.. కలెక్టర్‌ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో రాతపూర్వకంగా 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. నల్లబెల్లి మండల కేంద్రంలో కలెక్టర్‌ సోమవారం పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతితోపాటు బీసీ హాస్టల్‌ను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్‌ భవనాన్ని చూసి చలించారు. అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. అందుకు అవసరమైన నివేదికను ఇవ్వాలని చెప్పారు. హాస్టల్‌లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను తెలిచి అందులోని ఫిర్యాదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు.. మెనూ ప్రకా రం భోజనం అందిస్తున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు చిరువూరి శారదను అడిగి తెలుసుకున్నారు. ఇసుక, సిమెంట్‌, ఐరన్‌ ధరలు భరించలేకపోతున్నామని వివరిస్తూ లబ్ధిదారురాలు తన సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ.. వాహనాన్ని సమకూర్చుకుంటే 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందిస్తామని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అండగా ఉండేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుసంధానం చేసేందుకు కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఆమె వెంట జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, తహసీల్దార్‌ కృష్ణ, ఎంపీడీఓ నర్సింహమూర్తి, డీఈ విష్ణువర్ధన్‌, ఎంపీఓ రవి, ఏఈ శృతి ఉన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక

దుగ్గొండి: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా అందిస్తామని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని సోమవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేయొద్దని సూచించారు. ప్రభుత్వం అందించే ఇసుకను వినియోగించుకుని నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. నిర్ధేశిత కొలతలతో నిర్మాణం చేసుకుంటే ఖర్చు తక్కువ అవుతుందని లబ్ధిదారులకు వివరించారు. కలెక్టర్‌ వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ శ్రీధర్‌గౌడ్‌, హౌసింగ్‌ ఏఈ శ్రావణి, తదితరులు ఉన్నారు.

సమాచారం ఉన్నా..

హాస్టల్‌ పరిశీలనకు రాని డీబీసీడీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement