అవతరణ వేడుకలకు అతిథులు వీరే! | - | Sakshi
Sakshi News home page

అవతరణ వేడుకలకు అతిథులు వీరే!

May 31 2025 1:22 AM | Updated on May 31 2025 3:48 PM

వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: జూన్‌ 2 ఉదయం 10 గంటలకు తెలంగాణ ఆవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. హనుమకొండ జిల్లా పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. వరంగల్‌లో రాష్ట్ర రెవెన్యూశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. 

అదే విధంగా జయశంకర్‌ భూపాలపల్లిలో టీడీఎఫ్‌డీసీ చైర్మన్‌ పోదెం వీరయ్య, మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్‌ జె.రాంచంద్రునాయక్‌, జనగామలో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రముఖులు తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాలని, ఆ తర్వాత అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొన్నారు.

నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ఖిలా వరంగల్‌: నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్‌ 19వ డివిజన్‌ వివేకానంద కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి పైప్‌లైన్లు, డ్రెయినేజీ పనులు, 41వ డివిజన్‌ ప్రతాప్‌నగర్‌ ఉర్సు కరీమాబాద్‌లో రూ.34 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మేయర్‌ సుధారాణి, కలెక్టర్‌ సత్యశారద, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి సురేఖ వేర్వేరుగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్ల నిర్మాణాలకు అఽధిక ప్రాధాన్యమిస్తున్నామని, పేదల కాలనీల్లో ప్రధాన సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావు, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్‌, నాయకులు నవీన్‌రాజ్‌, కేడల పద్మ, ట్రాన్స్‌జెండర్‌ సవరం రంజిత తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రిని సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

సంగెం: మండల కేంద్రంలోని గ్రామీణ కుటుంబ సంక్షేమ కేంద్రాన్ని శుక్రవారం తెలంగాణ స్వస్థ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మెరుగైన, ఉన్నతస్థాయి వైద్యానికి కావాల్సిన సౌకర్యాలను పరిశీలించి నివేదిక తయారు చేసి అందజేస్తామని బృందం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో స్టేట్‌ క్వాలిటీ మేనేజర్‌ శ్రీనివాస్‌, వైద్యాధికారి వంశీకృష్ణ, డీపీఎంయూ అర్చన, డాక్టర్‌ క్రాంతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పాఠశాలల్లో మార్పుపై దృష్టిసారించాలి

విద్యారణ్యపురి: పాఠశాలల్లో మార్పుపై హెచ్‌ఎంలు దృష్టిసారించాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో జిల్లాలోని హెచ్‌ంఎలకు ఐదురోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేలా కృషి చేయాలన్నారు. డీఈఓ జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే దిశగా బడిబాట కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు సాంకేతికతను ఉపయోగించి విద్యాబోధన చేయాలని చెప్పారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌ సుజన్‌తేజ, రిసోర్స్‌ పర్సన్లు డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌, రవీందర్‌, మోహన్‌రావు, మహేష్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రిసోర్స్‌ పర్సన్లను సన్మానించారు.

అవతరణ వేడుకలకు అతిథులు వీరే!●1
1/2

అవతరణ వేడుకలకు అతిథులు వీరే!●

అవతరణ వేడుకలకు అతిథులు వీరే!2
2/2

అవతరణ వేడుకలకు అతిథులు వీరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement