
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
ఖానాపురం/నర్సంపేట రూరల్/దుగ్గొండి: ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ఖానాపురం మండలంలోని రాగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి వివరాలు సేకరించి, ధాన్యం తేమశాతాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని తూర్పాల పట్టుకుంటే తేమశాతం తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు పాటిస్తూ విక్రయించుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, ఇందులో నర్సంపేట నియోజకవర్గంలోనే 15 వేల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నర్సంపేట రూరల్ పరిధిలోని రాజుపేటలో హరి రైస్ మిల్, నర్సంపేట పట్టణంలని ద్వారకపేట శివారు గోపికృష్ణ రైస్మిల్, దుగ్గొండి మండలంలోని చలపర్తి గ్రామంలో వినాయక రైస్ మిల్లులను తనిఖీ చేసి మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కోతల పేరుతో దిగుమతులు ఆలస్యం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీసీఓ నీరజ, డీఎం సంధ్యారాణి, డీసీఎస్ఓ కిష్టయ్య, ఆర్డీఓ ఉమారాణి, నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, రెవెన్యూ, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జూన్ 3 నుంచి భూభారతి దరఖాస్తుల స్వీకరణ
న్యూశాయంపేట : జిల్లాలో జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి భూ భారతి పథకంపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డుల మంజూరిపై సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టరేట్లో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి పథకంలో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు నెల రోజుల్లో పూర్తి కావాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండో విడత అర్హులైన పేదలను ఎంపిక చేయాలని ఆదేశించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆమోదం పొందిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను స్థానిక ఎమ్మెల్యేల ఆమోదంతో తక్షణమే పంపిణీ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జూన్ 6 వరకు అందించేందుకు సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓలు కృషి చేయాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి సురేష్ ఆదేశించారు. రేషన్ కార్డు మంజూరిలో భాగంగా ప్రజా పాలన కౌంటర్ల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను సంబంధిత మండల తహసీల్దార్ల ద్వారా ఎంకై ్వయిరీ చేసి అర్హత మేరకు రేషన్ కార్డులు మంజూరి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద