
నకిలీ విత్తనాలు విక్రయించొద్దు
ఖిలా వరంగల్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించొద్దని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ విత్తనషాపుల డీలర్లు, యజమానులకు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతోపాటు వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్ శుక్రవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని విత్తన షాపుల్లో తనిఖీలు చేపట్టారు. విత్తన షాపుల్లో నిల్వల రిజిస్టార్ను పరిశీలించారు. విత్తన నిల్వలు, విత్తనాల లేబుల్, ట్యాగ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలని ఆదేశించారు. అనుమతి లేని నాసిరకం విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ పెడుతామని హెచ్చరించారు. విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు సైతం పలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఎరువులు, విత్తనాలను రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. తనిఖీల్లో ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్, ఎస్సై చాంద్పాషా, వ్యవసాయ అధికారి నేలకుర్తి రవీందర్, టెక్నికల్ వ్యవసాయ అధికారి సాగరిక, ఏఈఓ వంశీకృష్ణ పాల్గొన్నారు.
విత్తనాలు అధిక ధరలకు విక్రయించొద్దు
నర్సంపేట రూరల్ : అదిక ధరలకు విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ బృందం వ్యవసాయ సహాయ సంచాలకుడు శ్రీనివాస్ అన్నారు. నర్సంపేట పట్టణంలోని పలు విత్తన, ఎరువుల షాపులను శుక్రవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు అధికృత డీలర్ దగ్గరే కొనుగోలు చేయాలన్నారు. సీడ్ ప్యాకెట్స్పై అన్ని వివరాలు సరిగా ఉన్నాయో చూసుకోవాలని, పూర్తి వివరాలతో బిల్లు తీసుకుని పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలని తెలిపారు. కల్తీ విత్తనాల ప్యాకెట్లు అయితే వారిపై కేసు నమోదుచేసి నష్టపరిహారం పొందేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఎస్సై రవి కుమార్, వ్యవసాయ అధికారి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
విత్తన షాపుల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు
విత్తన ప్యాకెట్లను పరిశీలించిన ఏసీపీ నందిరామ్, డీఏఓ అనురాధ