
కేఎంటీపీలో ఫైర్ సేఫ్టీ పరిశీలన
● సందర్శించిన ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్
గీసుకొండ: జిల్లాలోని గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో నెలకొల్పిన పరిశ్రమల యూనిట్లలో అగ్రిప్రమాదాలు సంభవించకుండా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ శుక్రవారం పరిశీలించారు. జిల్లా అగ్నిమాపక అధికారి రాజేశ్వర్రావు, మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ సీఐ మహేందర్, ఎస్సైలు కుమార్, ప్రశాంత్బాబులతో కలిసి ఆయన కేఎంటీపీలోని గణేశా ఎకోటెక్ కంపెనీని పరిశీలించారు. కంపెనీలో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ, ఫైర్సేఫ్టీకి పాటిస్తున్న జాగ్రత్తల గురించి హెచ్ఆర్ శంకర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని రెండు పత్తి జిన్నింగ్ మిల్లులను సందర్శించి వాటిల్లో అగ్రిప్రమాదాల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి రాజేశ్వర్రావు మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాద్లోని గుల్జార్ హౌస్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దృష్ట్యా గణేశ కంపెనీతోపాటు జిన్నింగ్ మిల్లుల్లో ఫైర్ సేప్టీపై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.