
పూడికతీత పనుల్లో వేగం పెంచాలి
హన్మకొండ: భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో వేగం పెంచాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. భద్రకాళి చెరువు పూడికమట్టిని డంపింగ్ చేసే ప్రభుత్వ స్థలాలను క్షేత్రస్థాయిలో హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య, వరంగల్ కలెక్టర్ సత్యశారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజి వాకడే, అధికారులు మంగళవారం పరిశీలించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భద్రకాళి చెరువు మట్టిని డంపింగ్ చేసేందుకు నగరం చుట్టుపక్కల ఉన్న అనువైన ప్రభుత్వ స్థలాల జాబితాను రెవెన్యూ అధికారులు వెంటనే సాగునీటి పారుదల శాఖ అధికారులకు అందజేయాలని ఆదేశించారు. జూన్ 15లోగా పూడికతీత మట్టి తరలింపు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, పొలాల్లోకి చెరువు మట్టి తీసుకెళ్లేందుకు ఆసక్తి ఉన్న రైతులు సాగునీటి పారుదల శాఖ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హనుమకొండ, వరంగల్ ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, సత్యపాల్రెడ్డి, సాగునీటి పారుదల శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ శంకర్, కుడా పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీం రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
టీజీ ఎప్సెట్ షురూ
విద్యారణ్యపురి: రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఎప్సెట్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. వరంగల్ జోన్ పరిధిలో ఫస్ట్ సెషన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు నిర్వహించిన పరీక్షలకు 1,950 మంది అభ్యర్థులకు 1,866 మంది (95.7 శాతం) హాజరయ్యారని ఎప్సెట్ కన్వీనర్, జేఎన్టీయూ ప్రొఫెసర్ బి.డీన్కుమార్ తెలిపారు. సెకండ్ సెషన్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు 1,949 మందికి 1,889 మంది (96.9 శాతం) హాజరయ్యారు. నర్సంపేట జోన్లో ఫస్ట్ సెషన్లో 360 మందికి 346 మంది (96.1 శాతం), సెకండ్ సెషన్లో 360 మందికి 350 మంది (97.2 శాతం) హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. నిమి షం నిబంధన ఉండడంతో అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఈనెల 30 వరకు పరీక్షలు కొనసాగుతాయి. మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ బాక్సింగ్
టీం కోచ్గా శ్యాంసన్
వరంగల్ స్పోర్ట్స్: న్యూఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో బుధవారం నుంచి మే 6 వరకు ఎస్జీఎఫ్ అండర్–19 బాలికల బాక్సింగ్ పోటీలు నిర్వహించనున్నారు. తెలంగాణ జట్టు కోచ్గా హనుమకొండలోని కోమటిపల్లికి చెందిన సందెల శ్యాంసన్ నియమితులైనట్లు నిర్వహణ కమిటీ బాధ్యుడు శీలం పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలల క్రితం హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్లో ఎస్జీఎఫ్ అండర్–19 బాలికల రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. కాగా, తన నియామకానికి సహకరించిన ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి దస్రూనాయక్, బాక్సింగ్ అసోసియేషన్ బాద్యులు పార్థసారథి, ఎం స్వామిచరణ్, పి.నరసింహారాములుకు శ్యాంసన్ ధన్యవాదాలు తెలిపారు.