వరంగల్: జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్లోని పాత ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్లో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తు న్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల పురోగతిని బ్లూ ప్రింట్ మాప్ ప్రకారం మంగళవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 60 శాతం పనులు పూర్తయ్యాయని, ఫినిషింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు కలెక్టర్కు వివరించారు. 2025 సెప్టెంబర్ చివరి నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అభివృద్ధి పనులపై సమీక్ష..
మామునూరు ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సత్యశారద సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. వరంగల్ ఏనుమాముల, గీసుకొండ, ఖిలావరంగల్ ఇన్నర్రింగ్ రోడ్డు పనుల్లో భూమి కోల్పోయిన రైతులకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఆ పనుల్లో వేగం పెంచాలని ఆర్డీఓను ఆదేశించారు. ఎయిర్పోర్టు పనుల్లో ఖిలావరంగల్లోని నక్కలపల్లి, గాడిపల్లిలో సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో గ్రీన్ కవరేజీ ఏర్పాటు చేయాలని వారంలోగా 15,000 మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఎంప్లాయ్మెంట్ జెనరేట్ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించి గీసుకొండ, సంగెం, వరంగల్కు చెందిన 18నుంచి 39 ఏళ్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కుట్టు శిక్షణలో ప్రావీణ్యత కలిగిన వారిని ఎంపిక చేయాలని డీఆర్డీఓను ఆదేశించారు. నేషనల్ హైవే పనుల్లో నర్సంపేట, గీసుకొండ, సంగెం, చింత నెక్కొండలో ఆర్బిట్రేషన్ నిర్వహించిన అనంతరం అవార్డు పాస్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, అర్అండ్బీ జిల్లా అధికారి రమేష్, డీఈ శ్రీధర్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, ఏఈ శ్రీకాంత్, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్య శారద