1987 నుంచి బీసీలే చైర్మన్లు
● ఈసారి మారేనా?
● నేటితో ఉత్కంఠకు తెర
● కొత్త పాలకవర్గమైనా
అప్గ్రేడ్పై దృష్టి సారించేనా?
వనపర్తి: స్థానిక పురపాలికలో సుమారు నాలుగు దశాబ్దాలుగా పాలనా బాధ్యతలు బీసీలే చేపట్టారు. ఈసారి రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించడం, అధికార కాంగ్రెస్లో ఎస్ఎల్ఎన్ మాధవి రమేష్ ఒక్కరే జనరల్ మహిళ విజయం సాధించడంతో పీఠం ఆమెనే వరించనుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. పోటీలో మరో ముగ్గురు నేతలు తమ సతీమణులకు పదవి దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. గడిచిన 40 ఏళ్లలో ఏడుసార్లు బీసీలే చైర్మన్లుగా పని చేశారు. తొలిసారి ఓసీలకు అందులోనూ ఆర్యవైశ్యులకు అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటారనే చర్చ కొనసాగుతోంది. 1984లో వనపర్తి గ్రేడ్–3 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాగా.. 1987లో తొలిసారి చైర్పర్సన్కు ప్రత్యక్ష ఎన్నికలు పార్టీ గుర్తులపై నిర్వహించారు. తొలి మున్సిపల్ చైర్మన్గా బోలెమోని లక్ష్మయ్య సమీప అఽభ్యర్థి వనగంటి ఈశ్వర్పై గెలుపొంది పురుపాలనలో చెరగని ముద్ర వేశారు. 1987 నుంచి 1992 వరకు ఐదేళ్ల కాలంలో వైస్ చైర్మన్లుగా కె.విశ్వనాథం, బీబీ ప్రతాప్రెడ్డి, జింకల కృష్ణయ్య సేవలందించారు. 1992, మార్చి 29 నుంచి 1995, మార్చి 29 వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. 1995లో చైర్మన్ పదవి కోసం ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించగా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా చింతచెట్టు గుర్తుపై డా. దామోదర్ గెలుపొంది ఐదేళ్లు పాలించారు. ఈ సమయంలో వైస్ చైర్మన్గా తైలం శంకర్ప్రసాద్ సేవలందించారు. 2000, మార్చిలో నిర్వహించిన ఎన్నికల్లో వనపర్తి నగరపంచాయతీగా మారడం ఈ ఎన్నికల్లో చైర్పర్సన్గా విశ్రాంత ఉపాధ్యాయురాలు ప్రమీలమ్మ ఎన్నికయ్యారు. ఈ సమయంలో వైస్ చైర్మన్లుగా బి.కృష్ణ, బి.శ్రీనివాస్గౌడ్, బాశెట్టి శ్రీనివాస్ సేవలందించారు.
2004లో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను పరోక్ష (కౌన్సిలర్లు ఎన్నుకునే) పద్ధతికి మార్చారు. 2005 సెప్టెంబర్లో 26 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించగా.. 16 వార్డులు కాంగ్రెస్ కై వసం చేసుకుంది. రెండోసారి బోలెమోని లక్ష్మయ్య చైర్మన్గా, ఆర్.లోక్నాథ్రెడ్డి వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2010, అక్టోబర్ 1 నుంచి 2014 వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 2014, మార్చిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడగా.. అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి క్రాస్ఓటింగ్తో టీడీపీకి చెందిన పలుస రమేష్గౌడ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా బి.కృష్ణ రెండోసారి సేవలందించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీ సాధించడంతో గట్టుయాదవ్ చైర్మన్గా, వాకిటి శ్రీధర్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వారిని దింపి కొన్ని నెలలు పుట్టపాగ మహేష్ చైర్మన్గా.. పాకనాటి కృష్ణ వైస్ చైర్మన్గా కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. 2026 ఎన్నికల్లో కాంగ్రెస్కు సంపూర్ణ మెజార్టీ రా వటంతో కాంగ్రెస్పార్టీకి చెందిన కౌన్సిలర్లే సోమ వారం చైర్మన్ను ఎన్నుకోనున్నారు. ఈసారి పుర పీఠం ఆర్యవైశ్యులకు దక్కుతుందని ప్రచారం జో రుగా సాగుతోంది. ఇదే నిజమైతే తొలిసారి వనపర్తి పుర చైర్పర్సన్ ఓసీలకు దక్కినట్లవుతుంది.


