స్థానిక పోరుకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

స్థానిక పోరుకు కసరత్తు

Jun 24 2025 3:18 AM | Updated on Jun 24 2025 3:18 AM

స్థాన

స్థానిక పోరుకు కసరత్తు

ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నద్ధం

ఇప్పటికే బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ పూర్తి

బీసీ రిజర్వేషన్లపైనే ఉత్కంఠ

ప్రధాన పార్టీల సమావేశాలతో వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం

మూడు ప్రధాన పార్టీల కన్ను..

గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్‌ మండలాల వారీగా సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీ నాయకులు, కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. కాంగ్రెస్‌ హామీ ఇస్తున్నట్టుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరాలని, లేకపోతే ఈ అంశాన్ని ఎండగట్టాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. బీజేపీ సైతం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహించగా, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకోగా, కాంగ్రెస్‌ నాగర్‌కర్నూల్‌లో మూడు, నారాయణపేటలో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని సంపాదించింది. బీజేపీకి నారాయణపేట జిల్లాలోనే ఒక్క జెడ్పీటీసీ స్థానం దక్కింది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నాయి. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరి 2న ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. అలాగే పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ను సైతం రూపొందించి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధం కావడంతో స్థానిక పోరు నోటిఫికేషన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధం

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తును పూర్తిచేసింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చినా ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్‌ను అధికారులు పూర్తి చేశారు. బ్యాలెట్‌ బాక్సులతో పాటు బ్యాలెట్‌ పేపర్లను ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడంతో పాటు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వో, పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ బాక్స్‌లను ఆయా మండలాలకు తరలించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే కార్యాచరణ కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రిజర్వేషన్లపైనే ఉత్కంఠ..

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశమే కీలకంగా మారింది. ఈ విషయంపై కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా.. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన చట్టం ప్రకారం రిజర్వేషన్లను మరోసారి కొనసాగించే వీలుండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదం తెలిపి పార్లమెంట్‌కు పంపింది. పార్లమెంట్‌లో ఈ చట్టాన్ని అమలు చేస్తే బీసీ రిజర్వేషన్లు పెరిగి బీసీ వర్గాలకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లోనే ఈ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆయా పార్టీలు గెలుపొందిన స్థానాలు

గత ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లు

జిల్లా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు

మహబూబ్‌నగర్‌ 14 175

నాగర్‌కర్నూల్‌ 20 214

వనపర్తి 14 128

జోగుళాంబ గద్వాల 20 214

నారాయణపేట 11 142

జిల్లా బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ బీజేపీ ఇండిపెండెంట్‌

మహబూబ్‌నగర్‌ 111 42 6 16

నాగర్‌కర్నూల్‌ 137 52 4 16

వనపర్తి 89 20 – 19

జోగుళాంబ గద్వాల 50 17 – 5

నారాయణపేట 88 26 23 5

జిల్లా బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ బీజేపీ

మహబూబ్‌నగర్‌ 14 – –

నాగర్‌కర్నూల్‌ 17 3 –

వనపర్తి 13 1 –

జోగుళాంబ గద్వాల 7 – –

నారాయణపేట 9 1 1

స్థానిక పోరుకు కసరత్తు 1
1/2

స్థానిక పోరుకు కసరత్తు

స్థానిక పోరుకు కసరత్తు 2
2/2

స్థానిక పోరుకు కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement