
ముందుజాగ్రత్తలతోనే సీజనల్ వ్యాధుల నివారణ
పాన్గల్: సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ శ్రీనివాసులు సూచించారు. సోమవారం పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి.. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అదే విధంగా దావాజీపల్లిలో నిర్వహించిన సమగ్ర ఆరోగ్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. శిబిరంలో హెచ్ఐవీ, టీబీ తదితర నిర్ధారణ పరీక్షల ఆధారంగా అవసరమైన మందులు అందిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచాలని సూచించా రు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ చంద్రశేఖర్, సీ హెచ్ఓ రామయ్య, ఆయుస్మాన్ మందిర్ వైద్యాధికారి మైథిలి, సిబ్బంది రాంచందర్, రేవతి పాల్గొన్నారు.