
మాదకద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు
వనపర్తి: జిల్లాలో మాదకద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నషాముక్త్ భారత్పై జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యాలయాలు, బస్టాండ్, ఆటో స్టాండ్ వంటి ప్రదేశాల్లో నిఘా ఉంచాలన్నారు. మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీ రాజ్, విద్యాశాఖ, వైద్య, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి.. జిల్లాలో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.
ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి..
ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 90 ఫిర్యాదులు వచ్చినట్టు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మండల విద్యాధికారులు, హెచ్ఎంలు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లో మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ హెచ్ఎంలతో విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఉపాధ్యాయుల నియామకాలు సైతం జరిగినందున.. విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలోని గోపాల్పేట, ఏదుల, రేవల్లి మండలాల్లో విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉందని.. అంగన్వాడీ కేంద్రాల నుంచి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే విధంగా ఎంఈఓలు, హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజు మండల విద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, రోజువారీ నివేదిక ఇవ్వాలన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం..
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం టీజీ ఐపాస్ ద్వారా సత్వర అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీజీ ఐపాస్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విద్యుత్శాఖ, పరిశ్రమలశాఖ, టౌన్ ప్లానింగ్, లేబర్ డిపార్ట్మెంట్ వంటి శాఖలు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. అన్నింటినీ పరిశీలించాక జిల్లాస్థాయి టీజీ ఐపాస్ ద్వారా అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 24 దరఖాస్తులను పరిశీలించి.. 18 దరఖాస్తులను ఆమోదించినట్లు కలెక్టర్ చెప్పారు. మరో నాలుగింటిని తిరస్కరించగా.. రెండు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. ఇప్పటికే పరిశ్రమలు ఏర్పాటుచేసిన ఏడుగురు ఎస్సీ లబ్ధిదారులకు, 12మంది ఎస్టీ లబ్ధిదారులకు, ఒక పీహెచ్సీ లబ్ధిదారుడికి టి.ప్రైడ్ పాలసీ సబ్సిడీకి ఆమోదం తెలిపారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఏఎస్పీ ఉమా మహేశ్వరరావు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సుధారాణి, డీఆర్డీఓ ఉమాదేవి, ఎంఈఓ అబ్దుల్ ఘని, జీఎం ఇండస్ట్రీస్ జ్యోతి తదిరతులు
జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
కలెక్టర్ ఆదర్శ్ సురభి