
‘బెస్ట్’ నో అవైలబుల్!
బీఏఎస్ పథకానికి నిధుల కొరత
●
వనపర్తి: నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో చదువుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం (బీఏఎస్) నిధుల కొరతతో నీరసించిపోతోంది. రెండేళ్లుగా నిధులు నిలిచిపోవడంతో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో పేద విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చేందుకు యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులను లక్కీ డిప్ పద్ధతిన ఎంపిక చేసి.. ఆయా స్కూళ్లకు అధికారులు కేటాయిస్తారు. విద్యార్థులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలా పథకాన్ని రూపొందించారు. అయితే కొన్నేళ్ల పాటు ఈ పథకం సజావుగా సాగింది. ప్రస్తుత ప్రభుత్వం నిధుల విడుదలకు బ్రేక్ వేయడంతో పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లాలో ఐదు పాఠశాలలకు వర్తింపు..
బీఏఎస్ పథకంలో భాగంగా విద్యార్థులకు డే స్కాలర్స్, రెసిడెన్షియల్ విభాగాల్లో అవకాశం కల్పిస్తారు. ఒకటో తరగతిలో ఎంపికచేసే విద్యార్థులకు డే స్కాలర్స్లో.. ఐదో తరగతి నుంచి ఎంపికచేసే విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో ఎంపిక చేస్తారు. జిల్లా కేంద్రంలోని ప్రతిభ పాఠశాల, వనపర్తి మండలం పెద్దగూడెం సమీపంలోని రేడియంట్ హైస్కూల్, పెబ్బేరు మాస్టర్మైండ్, ఆత్మకూరులోని అక్షర, శ్రీవాణి పాఠశాలలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని బెస్ట్ అవైలబుల్ పథకానికి ఎంపికై న విద్యార్థులకు ఆయా కేటగిరీల్లో అడ్మిషన్లు ఇస్తున్నాయి. విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు అందించి విద్యనందించారు. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో తాము బీఏఎస్ పథకంలో అడ్మిషన్లు ఇవ్వలేం.. మునుపు పంపిన వారిని సైతం కొనసాగించలేమంటూ ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు తేల్చిచెబుతున్నాయి.
విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వం..
రెండేళ్లుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు నిధులు విడుదల కాలే దు. రూ.లక్షల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది. ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పిస్తాం. అప్పటి వరకు విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ఆయా పాఠశాలల యాజమాన్యాలను కోరాం. కొందరు పాజిటివ్గా.. మరికొందరు నెగిటివ్గా స్పందించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులను ఆయా పాఠశాలలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. – అబ్దుల్ ఘని, డీఈఓ
ఆందోళనలో తల్లిదండ్రులు..
బీఏఎస్ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమస్యను లిఖితపూర్వకంగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ స్పందించి ఆయా స్కూళ్ల యాజమాన్యాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాము రూ.లక్షల్లో అప్పులు చేసి రెండేళ్లుగా నెట్టుకొచ్చామని.. ఇక తాము భరించలేమంటూ తేల్చిచెప్పినట్లు తెలిసింది.
జిల్లాలో రూ. 4కోట్ల వరకు పెండింగ్
రెండేళ్లుగా నిధుల విడుదలకు బ్రేక్
అడ్మిషన్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు
ప్రజావాణిలో కలెక్టర్ను ఆశ్రయించిన విద్యార్థుల తల్లిదండ్రులు

‘బెస్ట్’ నో అవైలబుల్!

‘బెస్ట్’ నో అవైలబుల్!