
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లావ్యాప్తంగా నెలరోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. యాక్ట్ ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు అమలులో ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాళ్లలో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదని వివరించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ, కులమతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని కోరారు.