
పట్టణాభివృద్ధికి సహకరించండి
వనపర్తి: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారి విస్తరణకు సహకరించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ సురభి అధ్యక్షతన రహదారి విస్తరణ బాధితులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాకేంద్రం నుంచి పెబ్బేరు, పాన్గల్ రహదారి విస్తరణను ఇళ్లు, వ్యాపారసంస్థల యజమానులను ఒప్పించి తగిన పరిహారం చెల్లించి చేపడతామని వివరించారు. పాన్గల్ రోడ్లో ఇళ్లు కోల్పోతున్న వారికి రెండు పడక గదుల ఇళ్లు కేటాయించడం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వనపర్తి–పెబ్బేరు రహదారి విస్తరణ అనేది భావితరాలకు, వనపర్తి గౌరవాన్ని కాపాడేందుకు చాలా ముఖ్యమని.. వ్యాపారులు సహకరించాలని కోరారు. రోడ్డు ఎన్ని ఫీట్లు ఉండాలనేది టౌన్ ప్లానింగ్ ద్వారా రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా ఒకటి, రెండురోజుల్లో కలెక్టర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పదేళ్లలో పట్టణ జనాభా రెండింతలు పెరిగిందని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు ఉండాలన్నారు. పట్టణాల్లో కనీసం వంద ఫీట్ల రోడ్లుంటే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందని.. వనపర్తికి 2000 సంవత్సరంలోనే ప్లాన్ తయారుచేసి 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదించినట్లు చెప్పారు. కొంత స్థలం కోల్పోతున్న వారికి టీడీఆర్, పూర్తిగా స్థలం కోల్పోయే వారికి నష్ట పరిహారం అందిస్తామన్నారు. టీడీఆర్పై వ్యాపారులకు అవగాహన కల్పించారు. అనంతరం బాధితులు వారి వాదనలు, అభ్యర్థనలు తెలిపారు. రోడ్డు మధ్యభాగం ఎక్కడి నుంచి కొలతలు చేస్తారో నిర్ణయించాలని.. విస్తరణను 80 ఫీట్లకు కుదించాలని కోరారు. వ్యాపారుల తరఫున న్యాయవాది నిరంజన్పాషా వాదనలు వినిపించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్ రమేష్రెడ్డి పాల్గొన్నారు.