
విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి
వనపర్తి: విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానంపై అవగాహన పెంచి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని ఎస్పీ రావుల గిరిధర్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని ఉర్దూ మీడియం బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు కొనసాగుతున్న ఐదురోజుల వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తల బాల్యం, విద్యాభ్యాసం, జీవన పోరాటం, ప్రయోగాల రూపకల్పన వైపు దారితీసిన పరిణామాలను పిల్లలకు వివరించాలన్నారు. విజ్ఞానశాస్త్ర అధ్యయనానికి విదేశాలకు వెళ్లకుండా మన దేశానికే విదేశీయులు బారులు తీరేలా ఎదగాలని, అది కేవలం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని తెలిపారు. ప్రాచీనకాలంలో విద్య, వైద్యం, వైజ్ఞానిక, ఖగోళ శాస్త్రాల్లో భారతీయుల సామర్థ్యం గురించి వివరించారు. ఈ మధ్య జరిగిన యుద్ధంలో మన శాస్త్రవేత్తలు తయారు చేసిన క్షిపణులను ఎస్పీ గుర్తు చేశారు. భావితరం సంస్కారవంతమైన, స్ఫూర్తివంతమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా తయారుచేసే శక్తి సామర్థ్యాలు ఒక్క ఉపాధ్యాయునిపైనే ఉన్నాయని తెలిపారు. అనంతరం కోర్స్ డైరెక్టర్ మంజులత, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, ఏఎంఓ మహానంది ఎస్పీని సన్మానించారు. కార్యక్రమంలో డీపీఆర్లు శ్రీనివాసులు, సుదర్శన్రావు, మల్లేష్కుమార్, సాయిచందర్రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.