
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
గోపాల్పేట: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్వాహకులను హెచ్చరించారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు.. మిల్లులకు ఎంత తరలించారు, ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని గోదాంను పరిశీలించారు. గోదాంలో ధాన్యం నిల్వ చేసేందుకు అనుకూలమైన వాతావరణం, పటిష్ట భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తయితే మండలానికి సంబంధించిన ధాన్యం ఇక్కడే నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. స్థానిక నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు.
నేడు పీఎఫ్
సమస్యలపై సదస్సు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీఎఫ్ ఖాతాదారుల సమస్యల పరిష్కారానికి గాను మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో ‘నిధి ఆప్కే నిక్కత్–2’ నిర్వహించనున్నామని రీజినల్ పీఎఫ్ కమిషనర్–1 తేజ్ప్రతాప్సింగ్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు సదస్సులు మహబూబ్నగర్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్, నాగర్కర్నూల్ మున్సిపల్ కార్యాలయం, వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం, నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాలలోని ఎన్ఎస్ ఎంటర్ప్రైజెస్ (బీడీ మాన్యుఫ్యాక్చర్స్), గద్వాల పీఏసీఎస్లో, రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని మున్సిపల్ కార్యాలయంలో, వికారాబాద్ జిల్లా తాండూరులోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో కొనసాగుతాయన్నారు. అలాగే హైదరాబాద్ పరిధిలోని షేక్పేట్ నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కళాశాలలో, హైదరాబాద్ పీఎఫ్ రీజినల్ ఆఫీస్–2లో జరుగుతాయన్నారు. ఈ అవకాశాన్ని పీఎఫ్ ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నేడు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో మంగళవారం 11వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు బాలురు, బాలికలను ఎంపికలు నిర్వహిస్తామని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. స్థానిక మినీ స్టేడియంలో అండర్–8 బాలురు, బాలికల విభాగంలో 60తోపాటు 200 మీటర్ల పరుగు పందెం, టెన్నిస్ బాల్ త్రో, అండర్–10 బాలురు, బాలికల విభాగంలో 60తోపాటు 300 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, కిడ్స్ జావెలిన్ త్రో, అండర్–12 బాలురు, బాలికల విభాగంలో 60, 300, 600 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ఫుట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని, వీరు జూన్ 1వ తేదీన సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు.