
మంచి నడవడికతో గౌరవం పొందాలి
వనపర్తి: సమాజంలో మంచి నడవడికతో జీవిస్తూ అందరి ఆదరణ, గౌరవం పొందాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని అన్ని ఠాణాల్లో నేరచరిత్ర కలిగిన 85 మంది రౌడీషీటర్లు, 75 మంది అనుమానితులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి పలు సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, సాధారణ ప్రజా జీవనానికి ఇబ్బందులు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని, అలాంటి వారిపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. జిల్లా పరిధిలో సత్ప్రవర్తన కలిగి ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా జీవితాన్ని గడుపుతున్న రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను గుర్తించి పోలీసు రికార్డుల్లో నేరచరిత్రను తొలగిస్తామని, తమ కుటుంబ సభ్యులతో జీవితాన్ని గడపాలని కోరారు. అలాగే ఏదైనా, ఎక్కడైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారం అందించే బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని సూచించారు. హింసతో ఏదీ సాధించలేమని, ప్రతికార చర్యలకు కాకుండా పరస్పరం చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ రవిపాల్, సీసీఎస్ ఎస్ఐ జయన్న, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ ప్రజావాణికి 12 వినతులు..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 12 వినతులు వచ్చినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. అర్జీదారులు వివిధ సమస్యలపై నేరుగా ఎస్పీని కలిసి వినతులు అందించారు. ఎస్పీ స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారికి ఫోన్చేసి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.