
నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు
వనపర్తి: జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆధ్వర్యంలో జరిగిన టాస్క్ఫోర్స్ కమిటీ జిల్లాస్థాయి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభవుతున్నందున రైతులు విత్తనాలు నాటేందుకు సమాయత్తం అవుతుంటారని, పొరపాటున నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడా నకిలీ విత్తనాలు, ప్యాకింగ్ చేయని, లేబుల్ లేని విత్తనాలు అమ్మడానికి వీలు లేదని.. టాస్క్ఫోర్స్ బృందాలు విత్తన విక్రయ దుకాణాలను తనిఖీ చేసి ఎక్కడైనా పట్టుబడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు ఖరీదైనవి కావడంతో నకిలీవి విక్రయించే ప్రమాదం ఉందని.. జిల్లా, మండలస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనుమతి ఉన్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలని, ఇతరులు అమ్మడానికి వీలు లేదన్నారు.
ఫ జిల్లా రైతులు వరి మాత్రమే కాకుండా ఇతర వాణిజ్య పంటలు సాగుచేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైతులు సన్నరకం మాత్రమే సాగు చెసేలా అవగాహన కల్పించాలని, రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమం ద్వారా నకిలీ విత్తనాలు, పంట మార్పిడీపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఏడీఏ చంద్రశేఖర్, వ్యవసాయ అధికారి మున్నా, సీఐలు, ఎస్ఐలు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి