
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
గోపాల్పేట: ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూ భారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గోపాల్పేట మండలం పొలికెపహాడ్, చాకల్పల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని.. కొత్త చట్టం అమలును పరిశీలించారు. రైతులు భూ సమస్యలపై సమర్పించిన అర్జీలను వీలైనంత వరకు స్థానికంగానే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు తమ సమస్యలను ఒక పద్ధతి ప్రకారం ప్రొఫార్మాలో పూరించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సక్సెషన్ దరఖాస్తులు వస్తే వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. రైతులకు అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. పొలికెపహాడ్లో 44, చాకల్పల్లిలో 29 దరఖాస్తులు వచ్చాయని.. వాటిని త్వరగా పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
భూ భారతి రెవెన్యూ సదస్సుల్లోకలెక్టర్ ఆదర్శ్ సురభి