
పని ప్రదేశాల్లోవసతులు కల్పించండి
ఆత్మకూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని డీఆర్డీఓ ఉమాదేవి సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పిన్నంచర్లలో మంగళవారం జరుగుతున్న ఉపాధి పనులను ఆమె పరిశీలించారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలిగించకుండా ఎప్పటికప్పుడు ధాన్యం సేకరించాలని ఐకేపీ సిబ్బందిని డీఆర్డీఓ ఆదేశించారు. పిన్నంచర్లలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరామ్రెడ్డి, ఏపీఓ విజయభాస్కర్ పాల్గొన్నారు.
కూలీలకు కనీస
సౌకర్యాల కల్పన
పాన్గల్: వేసవి దృష్ట్యా ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలుగకుండా పనుల వద్ద వసతులు కల్పించాలని ఏపీడీ సయ్యద్ సుల్తాన్ సూచించారు. మంగళవారం మండలంలోని బుసిరెడ్డిపల్లి, రాయినిపల్లి, మాందాపూర్లో కొనసాగుతున్న ఉపాధి పనులు, ఆయా గ్రామపంచాయతీల్లో ఉపాధి పనులకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన రోజు వారి కూలి అందేలా పనులు కల్పించాలని, రికార్డులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ఉపయోగపడే పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. నర్సరీల్లో మొక్కల సంరక్షణకు చర్యలు చేపడుతూ నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను పెంచాలన్నారు. రైతులు పండ్ల తోటలను పెంచుకునేలా ప్రోత్సహించాలన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామాల వారిగా ఉపాధి పనులు, నర్సరీలు, మొక్కల లక్ష్యం, కూలీల సంఖ్య అంశాలపై ఆరా తీశారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఎంపీడీఓ గోవింద్రావు, ఏపీఓ కుర్మయ్య, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

పని ప్రదేశాల్లోవసతులు కల్పించండి