
ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు
గోపాల్పేట: ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తోందని.. పాడి రైతులు తమ పశువులకు వేయించి రోగాలబారిన పడకుండా చూసుకోవాలని స్టేట్ మానిటరింగ్ అధికారి విజయభాస్కర్రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం మండలంలోని జయన్న తిర్మలాపూర్లో గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి టీకాలు ఎలా వేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు రిజస్టర్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. 140 తెల్ల, 526 నల్ల పశువులకు టీకాలు వేసినట్లు సిబ్బంది చెప్పారు. వారి వెంట మండల పశువైద్యాధికారి డా. ఆంజనేయులు, లైవ్స్టాక్ అసిస్టెంట్ శ్రీనివాసులు, మండల పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డిగ్రీ పరీక్షలు వాయిదా
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ కోరులకు సంబంధించి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ పరీక్షలు బుధవారం (మే 6) నుంచి జరగాల్సి ఉంది. ప్రభుత్వం కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘాలు.. సోమవారం నుంచి డిగ్రీ కళాశాలలు బంద్ చేసి, ఆందోళనకు దిగిన నేపథ్యంలో పీయూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్వయం ఉపాధికి
కార్పొరేషన్ల తోడ్పాటు
స్టేషన్ మహబూబ్నగర్: స్వయం ఉపాధికి కార్పొరేషన్లు ఎంతో దోహదపడుతాయని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లాకేంద్రం షాసాబ్గుట్ట ముస్లిం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెహందీ, కంప్యూటర్ కోర్సులు పూర్తిచేసిన మహిళలకు సోమవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించే విధంగా కార్పొరేషన్లు చేయూత అందిస్తాయని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున స్కిల్డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, మెహందీ, కంప్యూటర్ కోర్సులతో పాటు అనేక విభాగాల్లో శిక్షణ పొందిన వారికి రుణాలు, వాటిపై సబ్సిడీలు కూడా మంజూరవుతాయని అన్నారు.