
‘ఈత సరదా విషాదంగా మారకూడదు’
వనపర్తి: విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో.. పిల్లలు, యువకులు సరదా కోసం, ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాల్వలకు వెళ్తారని, ఈత సరదా విషాదం కారాదని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని, ఎవరి పర్యవేక్షణ లేకుండా చిన్నారులను ఈత కొట్టడానికి పంపించడం వల్ల ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరన్నారు. అలాగే వేసవికాలంలో జిల్లాలో ఈత కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో అవగాహన కల్పించే విధంగా, ఈతకు వెళ్లినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని, ప్రజలంతా పోలీసు శాఖకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
● పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి పదోన్నతి పొందిన ఖిల్లాఘనపూర్ ఏఎస్ఐ సుధాకర్ ఎస్ఐగా, వనపర్తి రూరల్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ రాజగౌడ్ హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. పదోన్నతి పోలీసులకు ఎస్పీ పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యత పెంచుతాయన్నారు. పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఏఎస్పీ మహేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.