27న ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

27న ప్రవేశ పరీక్ష

Apr 21 2025 12:59 AM | Updated on Apr 21 2025 12:59 AM

27న ప్రవేశ పరీక్ష

27న ప్రవేశ పరీక్ష

కొత్తకోట రూరల్‌: మండలంలోని అమడబాకుల మోడల్‌ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 27న అర్హత పరీక్ష, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ మల్లికార్జున్‌గౌడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, అలాగే 7, 8, 9, 10 తరగతుల వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. సోమవారం నుంచి హాల్‌టికెట్లు ఆన్‌ౖలైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

20 మంది టీచర్లకు స్పౌజ్‌ బదిలీలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: 317 జీఓలో గతంలో ఇబ్బందులకు గురైన స్పౌజ్‌ ఉపాధ్యాయులకు త్వరలో బదిలీ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారు గతంలో తమకు బదిలీ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం ఈ అంశంపై నిర్ణయం తీసుకుని బదిలీలకు ఆమోదం తెలిపింది. మొత్తంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 20 మంది బదిలీపై రానున్నారు. పాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి మహబూబ్‌నగర్‌కు బదిలీ కానున్నారు. కాగా 8 మంది టీచర్లు ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా ప్రభుత్వం చాలా పోస్టులు భర్తీ చేసింది. ఖాళీలు ఎక్కువ లేని క్రమంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చే ఉపాధ్యాయులకు బై పోస్టుల కింద భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. 20 మంది ఉపాధ్యాయులకు అన్ని పరిశీలించి ఈ నెల 22లోగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

కబడ్డీ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నిక

వనపర్తి టౌన్‌: జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలో ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అడ్‌హక్‌ కమిటీ చైర్మన్‌, ఉమ్మడి మహబూబ్‌గర్‌ జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కురుమూర్తిగౌడ్‌ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ సభ్యులు కె.జగదీశ్వర్‌యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి మహేందర్‌రెడ్డి హాజరు కాగా.. ఎన్నికల అబ్జర్వర్‌గా నర్సింహులు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రధాన కార్యదర్శిగా కుర్మయ్య, అధ్యక్షుడిగా పి.వెంకటేశ్వర్‌రెడ్డి, చైర్మన్‌గా పద్మజారెడ్డి, కోశాధికారిగా గోపాల్‌, ఉపాధ్యక్షులుగా దామోదర్‌, అశోక్‌, వెంకటయ్య, సురేష్‌, వెంకటేష్‌, సంయుక్త కార్యదర్శులుగా తిరుపతయ్య, చంద్రశేఖర్‌గౌడ్‌, కిషోర్‌, నాగరాజు, కమలాకర్‌, కార్య నిర్వాహక కార్యదర్శులుగా మద్దిలేటి, వెంకటరాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని శాలువా, బొకేతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సభ్యుడు బాల రాజయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అద్దె బస్సుల

డ్రైవర్ల సమ్మె విరమణ

అచ్చంపేట: అచ్చంపేట ఆర్టీసీ డిపో ఎదుట గత ఐదురోజులుగా అద్దె బస్సుల ప్రైవేట్‌ డ్రైవర్లు చేపట్టిన సమ్మె ఆదివారం ముగిసింది. కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అద్దె బస్సుల యాజమాన్యం డ్రైవర్ల శ్రమ దోపిడీని అరికట్టాలని తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హయ్యర్‌ అద్దె బస్సు డ్రైవర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. సమ్మెతో దిగివచ్చిన యాజమాన్యాలు డ్రైవర్లకు గతం కంటే రూ.3 వేలు ఎక్కువ ఇచ్చేందుకు అంగీకరించారు. జీతాలు పెరగడంతో డ్రైవర్లు సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్‌నాయక్‌, అద్దె బస్సు ప్రైవేట్‌ డ్రైవర్ల నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్‌ మాట్లాడుతూ అద్దె బస్సు యాజమాన్యం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించారని చెప్పారు. సమ్మె చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగడంతో ఆర్టీసీ డీఎం జోక్యం చేసుకొని యాజమాన్యాలతో చర్చలు జరపడం వల్ల వేతనాలు పెరిగాయన్నారు. కార్యక్రమంలో నాయకులు రాములు, శ్రీహరి, అనిల్‌, నాగరాజు, బాలయ్య, చంద్రయ్య, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement