
తాలు పేరిట తరుగు.. రోడ్డెక్కిన అన్నదాత
వనపర్తి రూరల్: అకాల వర్షాలతో రైతులు నష్టపోగా.. చేతికందిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లగా తేమశాతం, తాలు పేరిట కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కోత విధిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కిష్టగిరి, పెద్దగూడెంతండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ నెల 17న కిష్టగిరిలోని కేంద్రంలో 721 బస్తాల వరి ధాన్యం తూకం చేసి లారీలో శ్రీరంగాపురం మండలం శేరుపల్లి వద్ద ఉన్న సప్తగిరి రైస్మిల్లుకు తరలించారు. అక్కడ మిల్లర్లు ధాన్యంలో తాలు ఉందని.. బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీసేందుకు ఒప్పుకుంటేనే దించుకుంటామని రైతులకు చెప్పగా వారు అందుకు అంగీకరించలేదు. దీంతో లారీలోని ధాన్యాన్ని దించకుండా నిలిపివేశారు. తాలు పేరిట మోసం చేస్తున్నారంటూ శనివారం ఉదయం పెద్దగూడెంతండా, కిష్టగిరి రైతులు వనపర్తి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడగా వారు ఒప్పుకోలేదు. దీంతో ఎస్ఐ పౌరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్తో మాట్లాడి అక్కడికి పిలిపించారు. 10 రోజల కిందట ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే నిర్వాహకులు తాలు పేరిట కొనుగోలు చేయడం లేదని రైతులు ఆయనకు వివరించారు. అలాగే కిష్టగిరి రైతులు సప్తగిరి రైస్మిల్లు యాజమాన్యం ధాన్యం దించుకోవడం లేదని తెలుపడంతో జిల్లా పౌరసరఫరాల అధికారి మిల్లరుతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
● రైతులు తేమశాతం, తాలు చూసుకొని ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తరుగు తీస్తారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. కావాలని ఎవరైనా కోత విధిస్తే చర్యలు తీసుకుంటాం. – కాశీ విశ్వనాథ్,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
● నేను 82 బస్తాల ధాన్యం విక్రయించగా.. తాలు పేరిట 4 బస్తాల తరుగు తీస్తామని మిల్లరు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో తేమశాతం, తా లు చూసే కొనుగోలు చేశారు. ఇప్పుడు త రుగు విధిస్తామంటే ఎలా ఒప్పుకుంటాం.
– కృష్ణా, రైతు, కిష్టగిరి
● నేను 215 బస్తాల ధాన్యాన్ని విక్రయించగా.. శ్రీరంగాపురం మండలం శేరుపల్లి వద్ద ఉన్న సప్తగిరి రైస్మిల్లుకు తరలించారు. అక్కడ తాలు పేరిట 14 బస్తాల ధాన్యం తరుగు ఇస్తే అన్లోడ్ చేసుకుంటామని చెప్పారు. అంత ధాన్యం పోతే మాకేం మిగులుతుంది.
– కుర్మయ్య, రైతు, కిష్టగిరి
●
రైతులతో మాట్లాడిన జిల్లా పౌరఫరాలశాఖ అధికారి, ఎస్ఐ
అధికారుల హామీతో శాంతించిన రైతులు

తాలు పేరిట తరుగు.. రోడ్డెక్కిన అన్నదాత