
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం
అమరచింత: ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి అనేక పథకాలు అమలు చేస్తోందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. రూ.3.44 కోట్లతో చేపట్టే మండలంలోని ధర్మాపురం, నందిమళ్ల బీటీ రహదారి పనులకు శనివారం ఆయన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీటీ పనులు త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిదంగా నందిమళ్ల క్రాస్రోడ్డు నుంచి మిట్టనందిమళ్ల వరకు ఉన్న రహదారిని బీటీగా మార్చేందుకు రూ.4.44 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రహదారుల గురించి పట్టించుకోకపోవడంతో ఆధ్వానంగా మారాయని.. సీఎం రేవంత్రెడ్డి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని, రహదారులు, తాగునీటి వ్యవస్థ, వైద్యం, విద్యపై ప్రత్యే దృష్టి సారించి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని వెల్లడించారు. అనంతరం ఈర్లదిన్నెలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే తాను ఈరోజు ఎమ్మెల్యేగా మీముందు ఉన్నానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఎన్నో చట్టాలు రూపొందించారని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చుకుంటామని ప్రకటనలు చేస్తోందని.. భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని దేశ, విదేశాల ప్రజలు ప్రశంసిస్తున్నారని తెలిపారు. పీఆర్ ప్రవీణ్, ఏఈ నరేష్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ చెన్నమ్మ, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ నారాయణపేట అధ్య క్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్ఖాన్, శ్రీనివాస్రెడ్డి, మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, ఆశిరెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.