
క్రమశిక్షణ, శ్రద్ధతో చదవాలి
గోపాల్పేట: విద్యార్థి దశలో తలవంచి క్రమశిక్షణతో చదివితే భవిష్యత్లో తల ఎత్తుకొని గర్వంగా జీవించగలరని విశ్రాంత జిల్లా విద్యాధికారి డా. విజయ్కుమార్ అన్నారు. బాపుబాటలో సత్యశోధన పాదయాత్రలో భాగంగా బుధవారం ఆయన గోపాల్పేటకు చేరుకొని బస్టాండులో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవ, సత్యమేవ జయతే, క్రమశిక్షణతో ముందుకు సాగడం తదితర అంశాల గురించి వివరించారు. క్రమశిక్షణ, శ్రద్ధతో చదవాలని, నిజాయితీగా ఉండి సత్యం మాత్రమే మాట్లాడాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రమాకాంత్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
గణిత ప్రతిభా పరీక్ష
వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం గణిత ఫోరం ఆధ్వర్యంలో గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూల్స్కు చెందిన 112 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. తెలుగు మీడియంలో ఎం.గణేష్ (జెడ్పీహెచ్ఎస్, పాన్గల్), కె.మహేశ్వరి (కేజీబీవీ, ఆత్మకూర్), సి.మంజుల (జెడ్పీహెచ్ఎస్, పాలెం), ఇంగ్లీష్ మీడియంలో మౌనేష్కుమార్ (జెడ్పీహెచ్ఎస్ బాలుర, వనపర్తి), జి.రాంచరణ్ (జెడ్పీహెచ్ఎస్ బాలుర, ఆత్మకూర్), జి.నిఖిలేష్కుమార్ (జెడ్పీహెచ్ఎస్, తిప్పడంపల్లి)తో పాటు మోడల్ స్కూల్ విద్యార్థులు ఎండీ మసూద్ (మోడల్ స్కూల్, పెబ్బేర్), తులసిగౌడ్ (మోడల్ స్కూల్, కొత్తకోట) చక్కటి ప్రతిభ కనబర్చి బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి మద్దిలేటి, గణితఫోరం అధ్యక్షుడు విజయ్కుమార్, విష్ణువర్ధన్రెడ్డి, వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
‘ఎంసీహెచ్లో సమస్యలు పరిష్కరించాలి’
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రం సమీపం నర్సింగాయిపల్లి శివారులో ఉన్న ఎంసీహెచ్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజాసంఘాల నాయకులు పరమేశ్వరాచారి, కురుమయ్య, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల డిమాండ్ చేశారు. బుధవారం వారు ఆస్పత్రిని సందర్శిఽంచి పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. ఆస్పత్రిలో రేడియాలజిస్ట్ లేక స్కానింగ్ కేంద్రం మూతబడిందని.. తప్పని పరిస్థితుల్లో గర్భిణులు ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. అక్కడే ఉన్న సులభ్ కాంప్లెక్స్లో వేడి నీటికి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రోగులకు నిరంతరం స్వచ్ఛమైన తాగు అందించాలని అధికారులను కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మి, ఉమా, రేణుక, ఆది, జి.బాలస్వామి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణ, శ్రద్ధతో చదవాలి

క్రమశిక్షణ, శ్రద్ధతో చదవాలి