వాడవాడలా ఈస్టర్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శిలువ మరణం పొందిన మూడో రోజున సమాధి నుంచి పునరుత్థానుడై(మళ్లీ జన్మించి రావడం) జీసస్ తిరిగి రావడాన్ని పురస్కరించుకుని, ఏటా ఈస్టర్ పండుగ జరుపుకుంటుండడం తెలిసిందే. ఏసుప్రభువు రాకను స్వాగతిస్తూ క్రైస్తవ విశ్వాసులంతా చర్చిల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం ర్యాలీలు చేపట్టి, క్రీస్తు పునరుత్థాన సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు ఒక్కరేనని, ఆయన బోధనలు అనుసరణీయమని ఫాదర్లు, పాస్టర్లు అన్నారు. మన పాపాల నుంచి మనల్ని రక్షించేందుకు క్రీస్తు తన రక్తాన్ని అర్పించారని, ఇప్పుడు మళ్లీ మనల్ని పాపాల బారినపడకుండా చేయడానికి మరణాన్ని జయించి వచ్చారన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల దయ, శత్రువుల పట్ల క్షమాపణ గుణం కలిగి ఉండాలని ప్రభువు సూచించారని, ఆయన మార్గాన్ని అనుసరించి ప్రపంచ శాంతికి దోహదపడాలని కోరారు.
–విజయనగరం టౌన్


