రాజాం సిటీ: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై శ్రద్ధ కనబరచాలని జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జె.గిరీష్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక యూనివర్సిటీలో 13వ ఏపీ స్టేట్ మెన్ అండ్ ఉమెన్ సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఎదుగుదల ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినప్పుడే ఉత్తమమైన క్రీడాకారులుగా గుర్తింపు పొందుతారని తెలిపారు. మొదటి రోజు మహిళా క్రీడాకారులకు పోటీలు నిర్వహించగా 80 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.కోటేశ్వరరావు, జాతీయ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎం.ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎంవీ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే....
జూనియర్ స్ట్రాంగ్ గర్ల్ విభాగంలో ఎం.షానూన్ (గుంటూరు), యు.నాగప్రగతి (విశాఖపట్నం), ఎన్.జ్ఞానదివ్య (గుంటూరు) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. అలాగే సబ్ జూనియర్ విభాగంలో జి.షరోన్ (కోనసీమ), వి.సువర్ణ (ఎన్టీఆర్), ఇ.లక్ష్మీవినయ్శ్రీ (గుంటూరు) విజేతలుగా నిలిచారు.
జీఎంఆర్ ఐటీ డీయూ వీసీ డాక్టర్ జె.గిరీష్.


